కేసీఆర్కు కూతురు కవిత లేఖ

ఈ లేఖలోని అంశాలు బీఆర్ఎస్ పార్టీ అంతర్గత పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలపై అనేక ఊహాగానాలకు తెర లేపాయి.
మే రెండో తేదీన ఆరు పేజీల్లో రాసినట్లు ఉన్న ఈ వైరల్ లేఖలో కవిత.. వరంగల్లో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహణ తీరుపై తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది.
సభలో కేసీఆర్ ప్రసంగానికి ముందు, పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడి ఉండాల్సిందని కవిత అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచిన నాయకులు, ధూంధాం కార్యకర్తలు ప్రసంగించి ఉంటే.. అది శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపి ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సభ ద్వారా కార్యకర్తలను పూర్తిగా ఆకట్టుకోవడంలో పార్టీ విఫలమైందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ ప్రత్యర్థులైన బీజేపీపై మరింత బలంగా విమర్శలు గుప్పించాల్సిందని కవిత ఈ లేఖలో అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారని, ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తాను కూడా బీజేపీ వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నానని, అందుకే బీజేపీని మరింత తీవ్రంగా లక్ష్యంగా చేసుకోవాలని ఆమె తన తండ్రికి సూచించినట్లు లేఖలో ఉంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చిందనే సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని, ఇది పార్టీకి ప్రతికూలంగా మారిందని కవిత పేర్కొన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, పార్టీకి నిర్దిష్టమైన కార్యక్రమాలు, మార్గదర్శకాలు అవసరమని అంతా భావించారని, కానీ వరంగల్ సభలో అలాంటి స్పష్టత కొరవడిందని లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికైనా ఒకటి లేదా రెండు ప్లీనరీ సమావేశాలను నిర్వహించి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని కవిత సూచించినట్లు ఈ లేఖలో ఉంది.
అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణ దశలో ఉన్నందున, ఇలాంటి అంతర్గత విశ్లేషణలు, వ్యూహాత్మక మార్పులు అత్యవసరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత చర్చలను, భవిష్యత్ కార్యాచరణపై ఉన్న ఆకాంక్షలను ఈ లేఖలో ఉన్న అంశాలు ప్రతిబింబిస్తున్నాయి. పార్టీ నాయకత్వం ఈ అంశాలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
కేసీఆర్కు తన కుమార్తె కవిత అంటే చాలా ఇష్టం. గతంలో నిజామాబాద్ నుంచి ఆమె ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడినప్పటికీ.. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. పార్టీ బలోపేతం కోసం కేసీఆర్తో వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన విషయాలను కవిత లేఖ రూపంలో రాయాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న సైతం తలెత్తుతోంది. ఇది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
కవిత రాసిన లేఖలో ఉన్న వివరాలు చూస్తే.. పాజిటివ్ అంశాలు, నెగెటివ్ అంశాలు అంటూ పాయింట్ల వైజ్గా రాశారు. వాటిని ఓసారి పరిశీలిద్దాం...
పాజిటివ్ అంశాలు :
- బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావడంపై మీకు నా హృదయపూర్వక అభినందనలు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి, వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
- సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపించింది
- మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు
- ‘ఆపరేషన్ కగార్’ గురించి మీరు మాట్లాడిన విధానం అందరికి నచ్చింది
- మీరు చెప్పిన ‘కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్’ అన్న మాట బాగా పాపులర్ అయింది
- పహల్గాం బాధితుల కోసం మీరు మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తా
- రేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజూ మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది.
- తెలంగాణ అంటే బీఆర్ఎస్.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు
- తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడుతారని ఆశించారు
- అయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం మీ సభ మీద సంతృప్తిగా ఉన్నారు
- పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి.
నెగిటీవ్ అంశాలు :
- ఉర్దూలో మాట్లాడకపోవడం.
- వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదు
- ఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు.
- పాత ఇన్ఛార్జులకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేడర్ను పట్టించుకోలేదు.
- పంచాయతీ ఎన్నికల బి-ఫారాల విషయంలో పాత ఇన్ఛార్జులకే బి-ఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొత్త ఆశావహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తోంది.
- కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహాన్ని చూపించారు. కానీ వారికీ ఆ అవకాశం లేకపోవడం మీ దగ్గరకు రాక మానేశారు. కొంతమందికే అనే ఫీలింగ్ ఉంది. దయచేసి అందరికి అవకాశం ఇవ్వండి.
- 2001 నుండి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది.
- ‘ధూమ్ ధాం’ కార్యక్రమం క్యాడర్ను ఆకట్టుకోలేకపోయింది.
- బీజేపీపై మీరు రెండు నిమిషాలే మాట్లాడడం వల్ల.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
- కాంగ్రెస్ క్రింద స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది. కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్లో ఉంది.
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్ఎస్.. బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.
- ప్రస్తుత రాజకీయాలపై మీరు శ్రేణులకు స్పష్టమైన కార్యక్రమాలు, దిశానిర్ధేశం ఇవ్వాలని అనుకున్నారు.
- కనీసం ఇప్పటికైనా ఒక ప్లీనరీ నిర్వహించి ఒకటి, రెండు రోజులపాటు క్యాడర్ అభిప్రాయాలు వినాలి. వారికి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వాలి. దయచేసి దీన్ని సీరియస్గా పరిగణించండి’ అని కేసీఆర్కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు.
