ఫోర్ ట్రిలియన్ ఎకానమీతో కష్టాలు తప్పవా?

- భారత్ పై ఇప్పటికే ట్రంప్ అక్కసు
- అన్ని రకాలుగా ఆంక్షలతో ఎదురుదాడి
- ఇమ్మిగ్రంట్లను తరిమేస్తున్నారు
- వర్సిటీల అడ్మిషన్లు రద్దు చేస్తున్నారు
- కంపెనీలను తమ దేశం వీడొద్దని బెదిరిస్తున్నారు
- టెక్ కంపెనీలలో అమెరికన్లను పెంచాలని పట్టు
- ఇప్పటికే టారిఫ్ల మోత మోగించిన ట్రంప్
- రెమిటెన్స్ చార్జీల వెనుక కుట్ర ఉందా?
- భారత్ పై ఆర్థిక యుద్ధం ప్రకటించారా?
- ఫోర్ ట్రిలియన్ ఎకానమీ సాధించినందుకు కక్షా?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ తో ఉగ్రవాదంపై పోరాడుతోంది. సరిహద్దుల దగ్గర పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగినా, పాక్ ఎప్పుడైనా దొంగ దెబ్బ తీయవచ్చన్న టెన్షన్ భారత్ ను వెంటాడుతోంది. ఇదే టైమ్ లో భారత్ ఫోర్ ట్రిలియన్ ఎకానమీ రికార్డును అధికారికంగా బీట్ చేసిందన్న వార్తలు వస్తున్నాయి. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ అత్యధిక ఆదాయం సాధించిన దేశాలు. కాగా తాజాగా భారత్ అతి కష్టం మీద జపాన్ ను అధిగమించి ఆ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పుడు భారత్ అధికారికంగా ఫోర్ ట్రిలియన్ ఎకానమీ దేశాల జాబితాలో నాల్గవ స్థానానికి చేరుకుంది. ఇక మనముందున్న టార్గెట్లు కేవలం జర్మనీ, చైనా, అమెరికాలను అధిగమించడం. తాజా లెక్కల ప్రకారం అమెరికా ఎకానమీ 30.507 ట్రిలియన్ డాలర్లు, కాగా చైనా ఎకానమీ 19.231 ట్రిలియన్ డాలర్లు, జర్మనీ ఎకానమీ 4.744 ట్రిలియన్ డాలర్లు. అమెరికా,చైనాల వంక ఇప్పట్లో చూడలేం కానీ కొంత కష్టపడితే జర్మనీని అధిగమించవచ్చు. అయితే ఈ సంతోషం కాస్తా ఆవిరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.భారత్ ఈ రికార్డు సాధన కోరి కష్టాలను కొనితెచ్చుకున్నట్లేనా? ట్రంప్ తాజా ద్వేషం వెనుక కారణం ఇదేనా? అంటే అవుననే చెప్పాలి.
మిసైల్ కన్నా పవర్ఫుల్ ఎకానమీ వార్ ఫేర్..
పాకిస్థాన్ భారత్ పై ఎక్కుపెట్టేందుకు ప్రయత్నించిన అణ్వస్త్రం కన్నా శక్తి వంతమైన టారిఫ్ ల అస్త్రం ట్రంప్ భారత్ పై ప్రయోగించారు. ట్రంప్ కు భారత్ పై చాలా అసంతృప్తి ఉంది. ఇటీవల కాలంలో మన దేశం లక్ష్యంగా చేసుకుని తీసుకుంటున్న నిర్ణయాలే అందుకు సాక్ష్యం. ఇమ్మిగ్రంట్లపై కొరడా ఝళిపించడమే కాక వారిని వెనక్కు తరిమేందుకు పాలసీలలో రకరకాల మార్పులు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు రిలీజ్ చేస్తున్నారు. అమెరికాలో దాదాపు పది లక్షల మంది భారతీయులు ఉన్నారు. వారంతా అక్కడ సౌకర్యవంతమైన, మెరుగైన సంపాదనతో నాణ్యమైన జీవితం గడుపుతున్నారు.అమెరికా వెళ్లిన ప్రతీ భారతీయుడు సొంత ఇంటికి ఎంతో కొంత డబ్బు పంపక మానడు.అలాగే అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు తమ సంపాదనలో మెజారిటీ వాటాను కుటుంబాలకు పంపి ఇక్కడ ఆస్తులు కూడ బెట్టుకుంటున్నారు. ఇళ్లు, పొలాలు, రియల్ ఎస్టేట్, గోల్డ్ స్టాక్ మార్కెట్ ఇలా రకరకాల రంగాలలో పెట్టుబడులు పెడుతున్నారు. సగటు తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు పెరగడం వల్ల మన దేశ ఎకానమీ కూడా ఆటో మేటిగ్గా పెరుగుతుంది. ప్రతీ ఏటా బిలియన్ల డాలర్ల సంపాదన భారత్ కు ఎన్నారైల రూపంలో వచ్చి చేరుతోంది. ఈ సొమ్ము రాక పరిశ్రమలు పెరగడానికి,రియల్ ఎస్టేట్ రంగానికి, ఆటో మార్కెటింగ్ రంగానికి పరోక్షంగా దోహదపడుతోంది. ఒక అంచనా ప్రకారం ఎన్నారైలు ప్రతీ ఏటా 130నుంచి 140 బిలియన్ల డాలర్లను భారత్ కు పంపుతున్నారు. అలాగే ఇండియన్ ఐటీ కంపెనీలు యూఎస్ క్లైంట్ల నుంచి పెద్ద మొత్తంలో వర్క్ కాంట్రాక్టుల రూపంలో సొమ్ము వసూలు చేస్తున్నాయి...ఇవన్నీ భారత్ 4 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి ప్రధాన కారణాలు.అందుకే ట్రంప్ భారత్ పై పరోక్ష యుద్ధానికి దిగుతున్నారు. అది బాంబులు, మిస్సైళ్ల దాడి కాదు. అంతకు మించి దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ఆర్ధిక యుద్ధం.భారత్ కు టారిఫ్ లు పెద్దగా వేయబోం అంటూనే తాను చేసే పని తాను చేసుకుపోతున్నారు. ఇందుకు ప్రధాన సాక్ష్యం ఇమ్మిగ్రంట్లపై ఆయన సంధిస్తున్న అస్త్రాలు. అమెరికాలో ఉండేందుకు సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. వీసాలు, పాస్ పోర్టులు కాదు.. వారు అమెరికా జాతి సంస్కృతి సంప్రదాయాలను గౌరవించి, దేశ ఆర్ధిక వ్యవస్థకు తోడ్పడే వాడు అయి ఉండాలన్నది ప్రధానమైన అర్హత అంటూ హడావుడి చేస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో ఇమ్మిగ్రంట్లను తరిమి కొట్టే అస్త్రాలు ప్రయోగిస్తున్నారు.గ్రీన్ కార్డు సాధించాలంటే ఇప్పుడు మరిన్ని కొత్త నిబంధనలు రూపొందాయి. అమెరికన్ రెసిడెంట్ అవ్వాలంటే ట్రంప్ గోల్డ్ కార్డు కొనాలి.. అలాగే విదేశీ స్టూడెంట్ల వీసా ప్రొసెసింగ్ ఆపేయడం మరొకటి.. అక్కడున్న స్టూడెంట్లు డిపోర్టేషన్ భయంతో అల్లాడుతున్నారు. వర్సిటీలకు నిధులకోత విధిస్తున్నారు. ఇలా తన ఇష్టానుసారం భారత్ ను బెదిరిస్తున్నారు. కాబట్టి ట్రంప్ ఎత్తుగడల్లా భారత్ ను బలహీనపరచడమే.
పెట్టుబడులను తరలించుకుపోయే ప్లాన్..
ట్రంప్ నిర్ణయంతో పెట్టుబడులు పెట్టే పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇపుడు భారత్ వైపు చూస్తున్నాయి. యాపిల్ సంస్థకు చెందిన ఐ ఫోన్ కంపెనీ తయారీని భారత్ లో వద్దని అమెరికాలో చేపట్టాలని ట్రంప్ ఆ సంస్థ అధినేత టిం కుక్ ను బెదిరించడం ఒక ఉదాహరణ.పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీలన్నీ ఉత్పత్తుల తయారీని భారత్ కు అవుట్ సోర్సింగ్ ఇచ్చేందుకు సిద్ధపడుతుండటం ట్రంప్ ను కలవరపెడుతోంది.త్వరలోనే ఐఫోన్ లను అత్యధిక ధరలకు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది భారత ఎకానమీని బిలియన్ డాలర్ల మేరకు నష్టపరిచే ఒక ఎత్తుగడ. అలాగే అమెరికాలో ఉన్నపెద్ద పెద్ద గూగుల్ లాంటి అమెరికన్ టెక్ కంపెనీలలో ఉన్న ఇండియన్ సిఈఓలకు సున్నితమైన హెచ్చరికలు అందుతున్నాయ్. ఆ కంపెనీలలో భారతీయుల ప్రాధాన్యత తగ్గించి స్థానిక అమెరికన్లకు అవకాశాలు కల్పించాలని ఒత్తిడులు పెరుగుతున్నాయ్.ఈ చర్యలన్నింటి అంతరార్ధం ఒకటే. భారత పెట్టుబడులన్నీ అమెరికాకు తరలించాలని ట్రంప్ వ్యూహం.స్థిరాస్థి పెట్టుబడులు, స్టాక్ కొనుగొళ్ల ద్వారా వచ్చే ఆదాయమంతా అమెరికాకు తరలించాలని వ్యూహం. అందుకే రెమిటెన్స్ ఛార్జీలు. ఇది భారత ఎకానమీని నేరుగా దెబ్బతీసే ఒక వ్యూహం. దీనివల్ల భారత్ లో పరిశ్రమలు కుదేలవుతాయి.అమెరికా ఉత్పత్తులు మనదేశంలో జీరో టారిఫ్ అడ్వాంటేజ్ కు చేరుకుంటాయి.
రెమిటెన్స్ ఛార్జీల వెనుక...
తాజాగా అమెరికానుంచి విదేశీయులు పంపే డబ్బుపై కూడా 5శాతం రెమిటెన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. హెచ్ వన్ బీ హొల్డర్లు, గ్రీన్ కార్డు హోల్డర్లు, ఎన్నరైలు అందరూ ఈ రెమిటెన్స్ కట్టాల్సిందే. ఈ భారం భవిష్యత్తులో15 శాతానికి పెంచినా ఆశ్చర్యం లేదు. తమ దేశంలో డాలర్లు సంపాదించి దానిని సులభంగా సొంత దేశానికి తరలించుకుంటున్నారని అక్కసు. ఈ సొమ్మంతా భారత్ ఎకానమీ పెరగడానికి దోహదపడుతోంది.ఇన్నాళ్లు అమెరికా నుంచి డబ్బు పంపడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. ఇప్పడు ఇలా కొత్త నిబంధనలు పెట్టడం వల్ల ఎన్నారైలు టాక్స్ ఎగొట్టడానికి హవాలా ఛానెళ్లలాంటి దొంగ రూట్లు అన్వేషిస్తారు. ఇది మన ఇండియన్ కరెన్సీకి చాలా పెద్ద దెబ్బ. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈచర్యలతో రూపాయి పతనం మరింతగా పెరుగుతుందని డాలర్ కు రూపాయి మారకం విలువ వందరూపాయలు అయిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.2014లో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి రూపాయి విలువ డాలర్ కు 60రూపాయలు. కాగా ఇప్పుడది 86 రూపాయలు. ఇది ఇంకా పెరుగుతూ పోవచ్చు. కరెన్సీ బలహీనపడితే ద్రవ్యొల్బణం పెరుగుతుంది. క్రూడాయిల్ ధరలు పెరిగాయంటే మార్కెట్ లో సమస్తమూ పెరుగుతాయి.
ట్రంప్ ఇలా పట్టు బిగించినకొద్దీ మనదేశం ఇరకాటంలో పడుతుంది.నిరుద్యోగం పెరుగుతుంది.ధరలు పెరుగుతాయి.ఫైనాన్షియల్ మార్కెట్లు కుదేలవుతాయి.అసలే పాకిస్థాన్ తో ఘర్షణ పడ్డారనే విమర్శలు రేగుతున్న ఈటైమ్ లో ఇలా ఆర్ధిక కల్లోలం రేగితే భారత్ ఇంటా బయటా వత్తిళ్లను ఎదుర్కొనక తప్పదు.ట్రంప్ భారత్ పై తన అక్కసును నెమ్మది నెమ్మదిగా బయటపెడుతున్నారు. ఇప్పటికే ట్రంప్ తాలూకు వ్యాపారాలన్నీ మనదేశం నుంచి మధ్య ఆసియా దేశాలకు తరలి పోతున్నాయి.అందుకే ట్రంప్ భారత, పాకిస్థాన్ ఘర్షణలో కూడా పరోక్షంగా పాక్ పక్షమే వహించారు. భారత పట్ల తన ద్వేషాన్ని, అక్కసును మెల్లి మెల్లిగా బయటపెడుతున్నారు.
