రూ.24,000 కోట్ల సన్ టీవీ వ్యాపారం కోసం కోర్టుకెళ్లిన అన్నాదమ్ములు

Maran Family : భారతదేశంలో చాలా పెద్ద మీడియా కంపెనీల్లో ఒకటైన సన్ టీవీ నెట్‌వర్క్ లో ఇప్పుడు ఓ పెద్ద కుటుంబ గొడవ బయటపడింది. ఇది మామూలు గొడవ కాదు, వేల కోట్ల రూపాయల ఆస్తి, అధికారం కోసం జరుగుతున్న పెద్ద యుద్ధం. ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ ఇంట్లోనే ఈ చిచ్చు రేగింది. ఆమె నాన్న కళానిధిమారన్, ఆయన తమ్ముడు దయానిధి మారన్.. ఇద్దరూ రూ.24,000 కోట్ల వ్యాపారం కోసం ఒకరికొకరు పోటీపడుతున్నారు. డీఎంకే ఎంపీ అయిన దయానిధి మారన్ అయితే, సన్ టీవీ పెద్దన్న కళానిధి మారన్‌పై పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు. మోసం చేశాడని, డబ్బును అక్రమంగా మార్చాడని (మనీ లాండరింగ్), అధికారాన్ని లాగేసుకున్నాడని అంటున్నారు. ఇదంతా షేర్ల గురించి మాత్రమే కాదు, రూ.24,000 కోట్ల ఆస్తి ఎవరి సొంతం అవుతుందనేదే అసలు ప్రశ్న.

డీఎంకే ఎంపీ, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన దయానిధి మారన్.. తన అన్నయ్య, సన్ టీవీ నెట్‌వర్క్ ఛైర్మన్ కళానిధి మారన్‌పై కోర్టుకు వెళ్లారు. జూన్ 10, 2025న ఒక లీగల్ నోటీసు పంపుతూ దయానిధి కొన్ని ఆరోపణలు చేశారు. సన్ టీవీ నెట్‌వర్క్‌లో 2003 తర్వాత షేర్లు అక్రమంగా మార్చబడ్డాయి, అది రూల్స్‌కు విరుద్ధమని అన్నారు. మనీ లాండరింగ్, మోసం, నమ్మక ద్రోహం వంటి ఆరోపణలు కూడా ఈ నోటీసులో ఉన్నాయి. ఈ నోటీసును కలానిధి మారన్, ఆయన భార్య కావేరీ మారన్‌తో పాటు మరో ఏడుగురికి పంపారు. 2024 అక్టోబర్ తర్వాత దయానిధి మళ్ళీ కోర్టుకు వెళ్లడం ఇది రెండోసారి.

నోటీసులో చెప్పిన దాని ప్రకారం, వాళ్ళ నాన్న ఎస్.ఎన్. మారన్ చనిపోయిన తర్వాత షేర్లను అక్రమంగా బదిలీ చేశారట. నాన్న డెత్ సర్టిఫికెట్ గానీ, వారసత్వ ధృవీకరణ పత్రం గానీ లేకుండా, వాళ్ళ తల్లి మల్లికా మారన్ పేరు మీద షేర్లు మార్చారని, ఆ తర్వాత ఆ షేర్లు కలానిధికి వెళ్ళాయని ఆరోపించారు. ఇంకో పెద్ద ఆరోపణ ఏంటంటే సెప్టెంబర్ 15, 2003న కళానిధి తనకు తానుగా ఒక్కో షేరును రూ.10కే 12 లక్షల షేర్లను కేటాయించుకున్నారట. కానీ అదే సమయంలో కంపెనీ షేర్ల మార్కెట్ ధర రూ.2,500 నుండి రూ.3,000 మధ్య ఉంది. దీన్ని పెద్ద మోసంగా, నమ్మక ద్రోహంగా దయానిధి అంటున్నారు.

దయానిధి మారన్ కోర్టులో కొన్ని డిమాండ్లు చేస్తున్నారు. 2003కు ముందు ఎలా షేర్లు ఉండేవో, అలాగే తిరిగి మార్చాలి. ఆ సమయంలో కంపెనీ ఆర్థికంగా బలంగానే ఉంది కాబట్టి, షేర్లను అలా మార్చడానికి సరైన కారణం లేదని నిరూపించాలి. కలానిధి పొందిన 60% వాటా చెల్లదు అని ప్రకటించాలి. అసలు కుటుంబానికి చెందిన వాటా 20%కి తగ్గిపోయింది, దాన్ని మళ్ళీ 50%కి పెంచాలి. దయానిధి, కళానిధి భార్య కావేరీ మారన్ వార్షిక జీతం రూ.87.5 కోట్లు పైనా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది కంపెనీ డబ్బును దుర్వినియోగం చేయడమే అని ఆయన ఆరోపించారు. 2003 నుండి ఇప్పటి వరకు కలానిధి, ఆయన భార్య పొందిన అన్ని ఆర్థిక లాభాలు, డివిడెండ్లు (లాభాల్లో వాటా), ఆస్తులు, ఆదాయాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం, కలానిధి మారన్‌కు సన్ టీవీ నెట్‌వర్క్‌లో 75% వాటా ఉంది. ఈ వాటా వల్లే ఆయన ఆస్తి దాదాపు 3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.25,000 కోట్లకు) చేరుకుంది. కానీ ఈ కేసు, ఒకవేళ కోర్టులో కొనసాగితే, సన్ టీవీ భవిష్యత్తు, దానిపై ఆయనకున్న అధికారంపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తవచ్చు. సన్ టీవీ నెట్‌వర్క్ భారతదేశంలో చాలా పెద్ద మీడియా గ్రూపులలో ఒకటి. దీనికి టీవీ ఛానెళ్లు, రేడియో స్టేషన్లు, ఇంకా మన ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి. ఈ గొడవ వల్ల కంపెనీలో షేర్లు ఉన్నవాళ్ళకి, డబ్బు పెట్టిన వాళ్ళకి, ఉద్యోగులకి కంగారు పట్టుకోవడం ఖాయం. ఒకవేళ ఈ గొడవ ఇంకా ముదిరితే, ఇది భారతదేశ మీడియా పరిశ్రమలోనే చాలా పెద్ద కుటుంబ గొడవల్లో ఒకటిగా మారవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story