Donald Trump : భారత బియ్యంపై ట్రంప్ కన్ను.. టారిఫ్లు పెంచితే మనదేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
టారిఫ్లు పెంచితే మనదేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారతీయ బియ్యంపై దృష్టి సారించారు. భారతదేశం బియ్యాన్ని అమెరికాలో డంప్ చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. టారిఫ్లు పెంచుతామని హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా భారతీయ వస్తువులపై సగటున 50% టారిఫ్లు విధిస్తోంది. బియ్యంపై ఇప్పటికే 53% టారిఫ్ ఉండగా, దానిపై మరింత అధిక సుంకం విధించాలని అమెరికా అధ్యక్షుడు యోచిస్తున్నట్లు సమాచారం.
ట్రంప్కు భారత బియ్యంపై కోపం ఎందుకు?
డొనాల్డ్ ట్రంప్కు విధేయులైన ఓటర్లలో అమెరికన్ రైతులు కూడా ఉన్నారు. అందుకే ట్రంప్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా ఉండే చర్యలు తీసుకుంటోంది. ఇతర దేశాల నుంచి బియ్యం, ఎరువులు రావడం వల్ల అమెరికా రైతు ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతోంది అనే ఆందోళన ఉంది. భారత్, థాయ్లాండ్ వంటి దేశాల నుంచి అమెరికాకు బియ్యం వస్తుంది. కెనడా నుంచి ఎరువులు వస్తాయి. వీటన్నింటిపై టారిఫ్లు విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో అమెరికన్ రైతులకు సహాయం చేయడానికి 12 బిలియన్ డాలర్ల ప్యాకేజీని కూడా ఆయన ప్రకటించారు.
టారిఫ్ల ప్రభావం
ట్రంప్ టారిఫ్ల పెంపు భారత బియ్యం ఎగుమతులపై ఎంత ప్రభావం చూపుతుంది? 2024-25లో భారత్ అమెరికాకు 392 మిలియన్ డాలర్ల విలువైన, 2.74 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇది భారతదేశం మొత్తం బియ్యం ఎగుమతులలో కేవలం 3% మాత్రమే. కాబట్టి అమెరికాకు బియ్యం ఎగుమతి ఆగిపోయినా, భారతదేశానికి అంత పెద్ద నష్టం ఉండకపోవచ్చు.
బాస్మతి ప్రత్యేకత
అమెరికాకు ఎగుమతి అయ్యే బియ్యంలో దాదాపు 86% బాస్మతి బియ్యమే ఉంది. భారతీయ బాస్మతి బియ్యానికి అమెరికా 4వ అతిపెద్ద మార్కెట్గా ఉంది. ఇతర సాధారణ భారతీయ బియ్యానికి అమెరికా 24వ అతిపెద్ద మార్కెట్గా ఉంది. భారతీయ బాస్మతి బియ్యం చాలా ప్రత్యేకమైనది. దాని సువాసన, ఆకారం, రుచికి సాటి వచ్చే బియ్యం అమెరికాలో లభించదు. అందుకే భారతీయ బాస్మతి బియ్యానికి భారీ డిమాండ్ ఉంది. ట్రంప్ అధిక సుంకం విధించినప్పటికీ, బాస్మతి బియ్యానికి ఉన్న డిమాండ్ తగ్గకపోవచ్చు. ఈ టారిఫ్ భారాన్ని చివరికి అమెరికాలోని వినియోగదారులే భరించాల్సి వచ్చే అవకాశం ఉంది.

