EPFO : ఈపీఎఫ్ఓ కి షాక్ ఇచ్చిన వినియోగదారుల ఫోరం.. తక్కువ పెన్షన్ డబ్బులు ఇస్తే ఊరుకోం
తక్కువ పెన్షన్ డబ్బులు ఇస్తే ఊరుకోం

EPFO : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకి ఒక ఉద్యోగికి సంబంధించి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ విత్డ్రా డబ్బుల లెక్కింపులో పొరపాటు చేయడం భారీగా చుట్టుముట్టింది. సేవల లోపం కింద ఈపీఎఫ్ఓను బాధ్యులను చేస్తూ హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం.. సదరు ఉద్యోగికి తక్కువగా చెల్లించిన బాకీ మొత్తంతో పాటు 9% వడ్డీ, రూ.1,000 నష్టపరిహారం, రూ.2,500 కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని కమిషన్ ఈపీఎఫ్ఓను ఆదేశించింది.
అసలు ఏమిటీ వివాదం?
హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా బైజ్నాథ్కు చెందిన ఒక ఉద్యోగి, 2024 ఏప్రిల్ 4 lig 2025 మార్చి 15 వరకు ఒక ప్రైవేట్ పాఠశాలలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా క్లర్క్గా పనిచేశారు. ఆయన ఉద్యోగ కాలంలో ప్రతి నెలా జీతం నుండి క్రమం తప్పకుండా ఈపీఎఫ్, ఈపీఎస్ విరాళాలు కట్ అయి ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ అయ్యాయి.
ఉద్యోగం మానేసిన తర్వాత, సదరు ఉద్యోగి తన ఈపీఎస్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లోని పాస్బుక్ ప్రకారం ఆయన ఖాతాలో ఈపీఎస్ కంట్రిబ్యూషన్ రూ.14,230 గా చూపించింది. అయితే, ఆయన బ్యాంక్ ఖాతాలో మాత్రం కేవలం రూ. 12,750 మాత్రమే డిపాజిట్ అయ్యాయి. దీనిపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు.
EPFO ఇచ్చిన వివరణ ఏమిటి?
వినియోగదారుల కమిషన్ విచారణలో ఈపీఎఫ్ఓ తన వాదనను వినిపిస్తూ.. సదరు ఉద్యోగి సర్వీస్ వ్యవధిలో 16 రోజుల పాటు నాన్-కంట్రిబ్యూటరీ పీరియడ్ ఉందనే కారణంతో, ఆయన పెన్షన్ కాలాన్ని కేవలం 10 నెలలుగా మాత్రమే పరిగణించామని తెలిపింది. 1995 ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నిబంధనల ప్రకారం రూ.15,000 గరిష్ట వేతన పరిమితి ఆధారంగానే ఈ లెక్కింపు చేశామని పేర్కొంది.
EPFO తప్పును కమిషన్ ఎలా పట్టుకుంది?
ఈ కేసును నిశితంగా పరిశీలించిన వినియోగదారుల కమిషన్, ఈపీఎఫ్ఓ చెబుతున్న 16 రోజుల నాన్-కంట్రిబ్యూటరీ పీరియడ్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేదా రికార్డులను సమర్పించలేకపోయిందని గుర్తించింది. రికార్డుల ప్రకారం ఉద్యోగి వరుసగా 11 నెలల 12 రోజుల పాటు పనిచేశారని స్పష్టమైంది. అందువల్ల 10 నెలల ఫ్యాక్టర్ వర్తింపజేయడం పూర్తిగా తప్పు అని ఆమోదించింది.
* సరైన ఫ్యాక్టర్: ఉద్యోగి పనిచేసిన కాలానికి 0.94 ఫ్యాక్టర్ వర్తించాలి.
* EPFO చేసిన తప్పు: అధికారులు కేవలం 0.85 ఫ్యాక్టర్ ఆధారంగా లెక్కించారు.
* లెక్కింపు తేడా: నిజానికి ఉద్యోగికి రూ. 14,100 అందాలి, కానీ ఇచ్చింది రూ. 12,750 మాత్రమే. దీంతో రూ. 1,350 తక్కువ చెల్లింపు జరిగిందని కమిషన్ నిర్ధారించింది.
ఈ తీర్పు ప్రాముఖ్యత ఏమిటి?
పింఛను మరియు ఈపీఎఫ్ విత్డ్రా చేసుకునే కోట్లాది మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. మీ పాస్బుక్లో ఉన్న రికార్డుకు, మీకు చేరిన అసలు సొమ్ముకు తేడా ఉన్నా లేదా లెక్కింపులో ఏవైనా సందేహాలు ఉన్నా ఉద్యోగులు ఊరికే ఉండకుండా ఈపీఎఫ్ఓ నుండి సరైన వివరణ కోరవచ్చు. సమస్య పరిష్కారం కాకపోతే వినియోగదారుల ఫోరం ద్వారా న్యాయం పొందవచ్చని ఈ కేసు నిరూపించింది.

