FASTag : ఫాస్టాగ్ కొత్త యాన్యువల్ పాస్.. రూ. 3,000తో ఏడాది పాటు ప్రయాణం
రూ. 3,000తో ఏడాది పాటు ప్రయాణం

FASTag : బస్సులు, మెట్రో రైళ్లలో పాస్ సిస్టమ్ ఉన్నట్లే, ఇప్పుడు నేషనల్ హైవేల మీద ఉన్న టోల్ ప్లాజాల వద్ద కూడా పాస్ విధానం రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ సిస్టమ్ను అమలులోకి తీసుకురానుంది. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కొత్త పాస్ పథకాన్ని ప్రకటించారు. "రూ.3,000 విలువైన ఫాస్టాగ్ ఆధారిత యాన్యువల్ పాస్ను ప్రవేశ పెడుతున్నాం" అని నితిన్ గడ్కరీ గారు తెలిపారు. ఈ కొత్త పాస్ కమర్షియల్ వాహనాలకు అందుబాటులో ఉండదు. కేవలం కార్, జీప్, వ్యాన్ వంటి నాన్ కమర్షియల్ ప్రైవేటు వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 2025 ఆగస్టు 15వ తేదీ నుండి ఈ ఫాస్టాగ్ పాస్ అందుబాటులోకి వస్తుంది. ఒక పాస్ ధర రూ.3,000 ఉంటుంది.
ఈ పాస్ యాక్టివేట్ అయినప్పటి నుండి ఒక సంవత్సరం వరకు చెల్లుతుంది. అయితే, దీనికి 200 ట్రిప్పుల పరిమితి ఉంటుంది. అంటే, ఈ పాస్ ద్వారా ఒక సంవత్సరంలో 200 సార్లు టోల్ను దాటవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే, అప్పుడే మీ పాస్ గడువు ముగుస్తుంది. ఉదాహరణకు, మీరు ఆరు నెలల్లోనే 200 ట్రిప్పులు పూర్తి చేస్తే, మీ పాస్ అప్పుడే అయిపోయినట్లు. ఆ తర్వాత మీరు మళ్ళీ కొత్త పాస్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ పాస్ దేశంలో ఎక్కడైనా, ఏ జాతీయ రహదారి పైన అయినా చెల్లుబాటు అవుతుంది. అంటే, మీరు దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా, ఈ పాస్ ఉంటే టోల్ ప్లాజాల వద్ద సులువుగా వెళ్లవచ్చు. ఈ పథకంలో సంవత్సరానికి 200 ట్రిప్పుల లిమిట్ అని చెబుతున్నా.. ఒక ట్రిప్ అంటే ఏమిటో నితిన్ గడ్కరీ స్పష్టం చేయలేదు. బహుశా, ఒక టోల్ ప్లాజాని దాటడాన్ని ఒక ట్రిప్గా పరిగణించవచ్చు. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో వస్తాయని భావిస్తున్నారు.
ఫాస్టాగ్ ఆధారిత ఈ పాస్ను ఆన్లైన్లోనే తీసుకోవచ్చు. రాజ్మార్గ యాత్ర యాప్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వెబ్సైట్, అలాగే రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వెబ్సైట్లలో త్వరలో ఈ పాస్ పొందడానికి లింక్లు అందుబాటులోకి వస్తాయి. అక్కడ ఈ పాస్ను యాక్టివేట్ చేసుకోవడానికి, రెన్యూవల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ప్రయాణికులకు టోల్ చెల్లింపుల ప్రక్రియను మరింత ఈజీ చేయనుంది.
