GST 2.0 : ఇకపై మందులు చాలా చీప్.. జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు గుడ్ న్యూస్
జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు గుడ్ న్యూస్

GST 2.0 : సెప్టెంబర్ 22 నుండి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి రానున్నాయి. చాలా వస్తువులపై జీఎస్టీ తగ్గనుంది. దానితో వాటి ధరలు కూడా తగ్గుతాయి. ఈ జీఎస్టీ తగ్గింపు సామాన్య ప్రజలకు కూడా ప్రయోజనం చేకూర్చాలనేది ప్రభుత్వ ఆశయం. ఇప్పటికే విక్రయం కాని వస్తువులకు ఎంఆర్పి రేటును సవరించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ధరల సవరణకు డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పించారు.
మందుల ధరలు తగ్గుతాయా?
ఇప్పటికే మార్కెట్లో ఉన్న మందులు, వైద్య పరికరాల ధరలను తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మందులను వెనక్కి తీసుకుని, కొత్త లేబుల్తో మళ్లీ విడుదల చేయాల్సిన అవసరం లేదని ఔషధ ధరల ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది.
ఎన్పీపీఏ ఆదేశాలు
ఎన్పీపీఏ ప్రకారం.. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఉత్పత్తులను వెనక్కి తీసుకోవడం, లేబుల్ మార్చడం వంటివి తప్పనిసరి కాదు. కానీ, ఈ ఉత్పత్తుల తయారీదారులు, మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ స్థాయిలో సవరించిన ధరలకు విక్రయిస్తున్నారని నిర్ధారించుకోవాలని ఎన్పీపీఏ తెలిపింది.
జీఎస్టీ తగ్గింపు వివరాలు
జీఎస్టీ కౌన్సిల్ అన్ని మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీని 18% నుండి 5%కి తగ్గించింది. దీనివల్ల మందుల ధరలు కనీసం 10% తగ్గుతాయి. జీఎస్టీ రేటు తగ్గింపు సెప్టెంబర్ 22 నుంచే అమలులోకి రావాలి. ఈ తేదీకి ముందు మార్కెట్లోకి వచ్చిన వస్తువులకు కూడా ఈ జీఎస్టీ తగ్గింపు వర్తిస్తుంది. కాబట్టి వాటి ధరలు కూడా తగ్గాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం.
కంపెనీలకు ఎన్పీపీఏ సూచనలు
అన్ని ఔషధ తయారీదారులు, మార్కెటింగ్ కంపెనీలు కొత్త జీఎస్టీ రేటుకు అనుగుణంగా మందులపై ఉన్న గరిష్ట రిటైల్ ధర లేదా ఎంఆర్పిని సవరించాలని ఎన్పీపీఏ ఆదేశించింది. డీలర్లు, రిటైలర్లకు ఇచ్చే ఫారం 5, 6 ద్వారా సవరించిన ధరల జాబితాను కంపెనీలు అందించాలని ఎన్పీపీఏ పేర్కొంది.
