Retirement Planning : రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ కావాలా? ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అదిరిపోయే స్కెచ్
ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అదిరిపోయే స్కెచ్

Retirement Planning : ఉద్యోగ విరమణ లేదా రిటైర్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరినీ వేధించే అతిపెద్ద ఆర్థిక సమస్య ఏంటంటే.. నెలనెలా వచ్చే జీతం ఆగిపోయాక రోజువారీ ఖర్చులను ఎలా నిర్వహించాలి? ఒకవేళ రిటైర్మెంట్ సమయానికి చేతిలో రూ.1.5 కోట్ల భారీ ఫండ్ ఉంటే, దాని ద్వారా ప్రతి నెలా రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ రెగ్యులర్ ఇన్కమ్ పొందడం సాధ్యమేనా? అనే ప్రశ్న చాలా మంది మధ్యతరగతి ఉద్యోగుల మనస్సులో మెదులుతుంటుంది. దీనికి ఆర్థిక నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు. అయితే, ఈ నెలవారీ ఆదాయం అనేది మనం ఎంచుకునే పెట్టుబడి మార్గాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, డబ్బును విత్డ్రా చేసుకునే పద్ధతిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.
ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. రూ.1.5 కోట్ల రిటైర్మెంట్ కార్పస్ ద్వారా ప్రతి నెలా సుమారు రూ.70,000 నుంచి రూ.1.2 లక్షల వరకు సులభంగా సంపాదించవచ్చు. ఇందుకోసం ఇన్వెస్టర్లు తమ రిస్క్ ప్రొఫైల్ను బట్టి మూడు రకాల ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలను ఎంచుకోవచ్చు. అవి కన్జర్వేటివ్, మోడరేట్, అగ్రెసివ్. రిటైర్మెంట్ ప్లానింగ్లో కేవలం ఎక్కువ రిటర్న్స్ సంపాదించడమే ముఖ్యం కాదు, ఆ పెట్టుబడి ఎక్కువ కాలం మనుగడ సాగించేలా, దేశంలో పెరిగే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా ఉండటం చాలా అవసరం.
పెట్టుబడి విషయంలో ఎలాంటి రిస్క్ వద్దు, తమ అసలు సొమ్ము చాలా భద్రంగా ఉండాలనుకునే వారు సాధారణంగా కన్జర్వేటివ్ వ్యూహాన్ని ఎంచుకుంటారు. వీరు తమ ఫండ్ను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), ఆర్బీఐ బాండ్లు, ప్రభుత్వ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, యాన్యుటీ ప్లాన్స్ వంటి అత్యంత సురక్షితమైన మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ రకమైన పెట్టుబడి ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం లేకుండా, ప్రతి నెలా సుమారు రూ.70,000 నుంచి రూ.85,000 వరకు స్థిరమైన, గ్యారెంటీ ఆదాయాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొద్దిగా రిస్క్ తీసుకోగలిగే మధ్యస్థ ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో డెట్, ఈక్విటీ రెండింటినీ సమంగా మిక్స్ చేస్తారు. ఇందులో భాగంగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్సీఎస్ఎస్ లలో పెట్టుబడి పెడతారు. ఈ వ్యూహం వల్ల ప్రతి నెలా స్థిరమైన ఆదాయం రావడంతో పాటు, కాలక్రమేణా అసలు పెట్టుబడి విలువ కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ మిశ్రమ వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా ప్రతి నెలా దాదాపు రూ.85,000 నుంచి రూ.1 లక్ష వరకు మెరుగైన ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఎక్కువ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నవారు, భవిష్యత్తులో పెద్ద మొత్తంలో కార్పస్ పెంచుకోవాలనుకునే వారు అగ్రెసివ్ వ్యూహాన్ని పాటిస్తారు. వీరు తమ మొత్తం నిధిలో 50 నుంచి 65 శాతం వరకు భాగాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా గ్రోత్ ఆధారిత స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. లాంగ్ టర్మ్లో ఈ మార్గం ద్వారా అద్భుతమైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, తద్వారా ప్రతి నెలా రూ.1 లక్ష నుంచి ఏకంగా రూ.1.2 లక్షల వరకు భారీ ఆదాయం అందుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్లో షేర్ మార్కెట్ పతనాలు వంటి రిస్క్లు కూడా అంతే స్థాయిలో ఉంటాయని గుర్తుంచుకోవాలి.
'
రిటైర్మెంట్ ఫండ్ అనేది మనం బతికినంత కాలం తోడుగా ఉండాలి అంటే, విత్డ్రావల్ రేట్ (డబ్బు వెనక్కి తీసే శాతం) పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సాధారణంగా ఏడాదికి మొత్తం ఫండ్లో 4.5% నుంచి 6.5% వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవడం సురక్షితమైన పద్ధతిగా భావిస్తారు. ఇందుకోసం ఆర్థిక సలహాదారులు బకెట్ స్ట్రాటజీని రికమండ్ చేస్తున్నారు. ఇందులో స్వల్పకాలిక అవసరాల కోసం కొంత మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్లో, మధ్యకాలిక అవసరాల కోసం సురక్షిత బాండ్లలో, దీర్ఘకాలిక భద్రత కోసం మిగిలిన భాగాన్ని ఈక్విటీల్లో విడతల వారీగా దాచి ఉంచుతారు. ఈ విధమైన క్రమశిక్షణతో కూడిన ప్లానింగ్ వల్ల రూ.1.5 కోట్ల ఫండ్ ఎన్నో ఏళ్ల పాటు నిరంతరాయంగా డబ్బులు ఇచ్చే కామధేనువులా మారుతుంది.

