Digital Privacy : ఏప్రిల్ 1 నుంచి మీ ఫోన్లోని మెసేజ్లు, డేటాను ప్రభుత్వం చెక్ చేస్తుందా?
ప్రభుత్వం చెక్ చేస్తుందా?

Digital Privacy : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వార్త పన్ను చెల్లింపుదారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం, 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం మీ వ్యక్తిగత ప్రైవసీలోకి చొరబడడానికి సిద్ధమవుతోందని ఆ పోస్ట్లలో పేర్కొన్నారు. ఈ వైరల్ మెసేజ్ల ప్రకారం.. ఇన్కమ్ ట్యాక్స్ విభాగం మీ బ్యాంక్ అకౌంట్, ఈమెయిల్, సోషల్ మీడియా అకౌంట్స్ను కూడా నేరుగా చెక్ చేసే అధికారం పొందుతుందని ప్రచారం జరిగింది. తమ ప్రైవసీకి భంగం వాటిల్లుతుందనే ఆందోళనతో చాలా మంది ఈ వార్తను నమ్ముతున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది.
ఇండియన్ టెక్ గైడ్(@IndianTechGuide) అనే హ్యాండిల్ నుంచి వచ్చిన ఒక పోస్ట్ను ఉటంకిస్తూ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 2025లో పన్ను ఎగవేతను అరికట్టే నెపంతో, ఆదాయపు పన్ను శాఖకు అన్ లిమిటెడ్ అధికారాలు లభించాయని ప్రచారం జరిగింది. రొటీన్ తనిఖీ కోసం కూడా ఈ విభాగం మీ వ్యక్తిగత మెసేజ్లు, సోషల్ మీడియా కార్యకలాపాలు, ఈమెయిల్లను పరిశీలించవచ్చని ఈ వైరల్ సందేశాలలో ఉంది. ఈ తరహా వాదనలు నిస్సందేహంగా సాధారణ పౌరుల ప్రైవసీ హక్కును ప్రశ్నించే విధంగా ఉండటంతో, భయాందోళనలు పెరిగాయి.
ఈ వైరల్ ప్రచారం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీనిపై ఫ్యాక్ట్ చెక్ నిర్వహించింది. పీఐబీ ఈ దావా తప్పు అని స్పష్టం చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ విభాగానికి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరి డిజిటల్ స్పేస్లోనైనా తనిఖీ చేసేందుకు ఎలాంటి బ్లాంకెట్ రైట్ ఇవ్వబడలేదు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సందర్భం లేకుండా వ్యాప్తి చేస్తున్న కేవలం వదంతి మాత్రమేనని పీఐబీ ప్రకటించింది.
ఈ గందరగోళానికి కారణమైన ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 2025లోని సెక్షన్ 247 గురించి పీఐబీ వివరించింది. ఈ సెక్షన్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. వీటిని నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే ఉపయోగించవచ్చు. ఎవరైనా పన్ను చెల్లింపుదారుపై సెర్చ్ అండ్ సర్వే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మాత్రమే, అంటే భారీ పన్ను ఎగవేతకు పక్కా ఆధారాలు ఉండి, ఐటీ విభాగం అధికారికంగా దాడులు లేదా సోదాలు చేస్తున్నప్పుడు మాత్రమే, మీ డిజిటల్ డేటాను యాక్సెస్ చేయడానికి అనుమతి ఉంటుంది. అంతేకానీ సాధారణ పౌరుల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదు.

