BSNL : టెలికాం రంగంలో భారత్ కొత్త మైలురాయి.. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ స్టాక్ ప్రారంభం
బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ స్టాక్ ప్రారంభం

BSNL : భారత టెలికాం రంగం చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (సెప్టెంబర్ 27) బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ స్టాక్ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ద్వారా, డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా, చైనా వంటి అగ్రగామి దేశాల సరసన, సొంతంగా టెలికాం పరికరాలను తయారు చేయగల అరుదైన దేశాలలో ఒకటిగా భారతదేశం నిలవనుంది. ఇది దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలకు, ఆత్మనిర్భర్ భారత్కు ఒక పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు.
ఒడిశాలోని ఝార్సుగూడలో ప్రధాని నరేంద్ర మోడీ 97,500కు పైగా 4G మొబైల్ టవర్లను దేశానికి అంకితం చేయనున్నారు. వీటిలో 92,600కు పైగా టవర్లను బీఎస్ఎన్ఎల్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించింది. ఈ టవర్లు భవిష్యత్తులో 5Gకి అప్గ్రేడ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీని ద్వారా, భారతదేశం 1.2 బిలియన్లకు పైగా వినియోగదారులకు తక్కువ ధరకే కాల్, ఇంటర్నెట్ సేవలను అందించే దేశంగా మాత్రమే కాకుండా, సొంతంగా టెలికాం పరికరాలను తయారు చేయగల దేశంగా అవతరించింది. ఇది మేక్ ఇన్ ఇండియా చొరవకు ఒక గొప్ప ఉదాహరణ.
ఈ స్వదేశీ 4G నెట్వర్క్ స్టాక్ నిర్మాణంలో అనేక భారతీయ కంపెనీలు కీలక పాత్ర పోషించాయి.
రేడియో యాక్సెస్ నెట్వర్క్ (RAN): దీన్ని తేజాస్ నెట్వర్క్స్ అభివృద్ధి చేసింది.
కోర్ నెట్వర్క్: దీన్ని సి-డాట్ (C-DOT) అభివృద్ధి చేసింది.
ఇంటిగ్రేషన్: ఈ మొత్తం సిస్టమ్ ఇంటిగ్రేషన్ బాధ్యతను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సమర్థవంతంగా నిర్వహించింది.
డిజిటల్ ఇండియా నిధి సచ్యురేషన్ యోజన కింద, కనెక్టివిటీ లేని సుమారు 26,700 గ్రామాలకు, సరిహద్దు ప్రాంతాలకు 4G కనెక్టివిటీని అందించాలనే లక్ష్యంతో 14,180 టవర్లను నిర్మించారు. బీఎస్ఎన్ఎల్తో పాటు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతి ఎయిర్టెల్ కంపెనీలు కూడా 4,700కు పైగా 4G టవర్లను ఏర్పాటు చేశాయి. ఈ కొత్త టవర్లు 20 లక్షలకు పైగా కొత్త కస్టమర్లకు సేవలు అందిస్తాయని అంచనా. ఆన్లైన్ విద్య, ఇ-పరిపాలన, డిజిటల్ చెల్లింపులు వంటి అనేక అంశాలకు ఈ కొత్త టవర్లు గణనీయంగా సహాయపడతాయి. ఇది దేశవ్యాప్తంగా డిజిటల్ అంతరాన్ని తగ్గించి, మరింత మంది ప్రజలను డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి తోడ్పడుతుంది.
