Indian Railways : రైల్వే ట్రాక్లపై సోలార్ ప్యానెల్స్.. భారత రైల్వేల సరికొత్త ప్రయోగం
భారత రైల్వేల సరికొత్త ప్రయోగం

Indian Railways : భారతీయ రైల్వేలు ఇప్పుడు ఒక కొత్త చరిత్రకు నాంది పలికాయి. పునరుత్పాదక శక్తిని వినియోగించుకోవడంలో ఒక కీలకమైన అడుగు వేశాయి. రైలు పట్టాల మధ్య సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసే ప్రయోగాన్ని భారతదేశంలో మొదటిసారిగా చేపట్టాయి. వారణాసిలోని బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (BLW) ఈ వినూత్న ప్రయోగానికి కేంద్రంగా మారింది. ప్రస్తుతం భారతీయ రైల్వేలు 70 మీటర్ల ట్రాక్పై ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ట్రాక్పై ఏర్పాటు చేసిన 28 సోలార్ ప్యానెల్స్తో 15 కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు.
ఇది ప్రపంచంలోనే అరుదైన ప్రయోగం..
రైలు పట్టాల మధ్య సోలార్ ప్యానెల్స్ను అమర్చడం ప్రపంచంలోనే చాలా అరుదైన ప్రయోగం. ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో కూడా ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే, వాటిలో కొన్ని ఇంకా పరీక్ష దశలోనే ఉన్నాయి. ఈ ప్యానెల్స్ను అవసరమైనప్పుడు సులభంగా తొలగించి, తిరిగి అమర్చే విధంగా రూపొందించారు. ఇది ట్రాక్ మెయింటెనెన్స్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
భారత రైల్వేలు కార్బన్ రహితంగా..
భారతీయ రైల్వేలు పూర్తిగా కార్బన్ రహితంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ లక్ష్య సాధనకు రైలు పట్టాల మధ్య సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ఒక ముఖ్యమైన అడుగు. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత రైల్వేలు దేశవ్యాప్తంగా ఉన్న 1.2 లక్షల కిలోమీటర్ల రైలు నెట్వర్క్పై ఈ ప్యానెల్స్ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఈ విధంగా ట్రాక్ల మధ్య సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయడం ద్వారా, ఒక కిలోమీటర్కు సంవత్సరానికి 3.21 లక్షల యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా. మొత్తం నెట్వర్క్పై ఈ ప్యానెల్స్ను ఏర్పాటు చేస్తే, సంవత్సరానికి 38 TWH సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. ఇది భారతీయ రైల్వేలకు అవసరమైన విద్యుత్ కంటే రెట్టింపు. దీనితో రైల్వేలు పూర్తిగా ఇంధన స్వయం సమృద్ధిని సాధించే అవకాశం ఉంది.
