మే నెలలో 2.82శాతానికి పడిపోయిన ద్రవ్యోల్బణం

Inflation : భారతదేశంలో ద్రవ్యోల్బణం వరుసగా తగ్గుతూ వస్తోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా సామాన్య ప్రజలకు శుభవార్త. మే నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గి 2.82 శాతానికి చేరుకుంది. అంతకు ముందు నెల ఏప్రిల్‌తో పోలిస్తే ఏకంగా 34 బేసిస్ పాయింట్లు తగ్గింది. చాలా మంది ఆర్థిక నిపుణులు అంచనా వేసిన దానికంటే కూడా ఈ తగ్గుదల ఎక్కువగా ఉంది. ముఖ్యంగా, గత ఆరేళ్లలో ఇదే అతి తక్కువ ద్రవ్యోల్బణ స్థాయి కావడం విశేషం. 2019 ఫిబ్రవరి తర్వాత నమోదైన అత్యల్ప ద్రవ్యోల్బణం ఇదే.

ధరల పెరుగుదలకు బ్రేక్

ద్రవ్యోల్బణం ఇంతలా తగ్గడానికి ప్రధాన కారణం ఆహార వస్తువుల ధరలు గణనీయంగా తగ్గడమే. ఏప్రిల్‌లో 1.78 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం, మే నెలలో కేవలం 0.99 శాతానికి పడిపోయింది. అంటే ఏకంగా 79 బేసిస్ పాయింట్ల తగ్గుదల నమోదైంది. కూరగాయలు, పప్పులు, నూనెలు వంటి నిత్యావసరాల ధరలు దిగిరావడంతో సామాన్యులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని ఇస్తుందని నిపుణులు అంటున్నారు.

జూన్‌లో ఇంకా తగ్గుతుందా ద్రవ్యోల్బణం?

ఐసిఆర్‌ఎ (ICRA) వంటి రేటింగ్ సంస్థల అంచనాల ప్రకారం.. జూన్ నెలలో కూడా ఆహార వస్తువుల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు సకాలంలో వచ్చి, వర్షాలు బాగా పడి, పంటలు ఆశాజనకంగా ఉండడం ఈ శుభ సూచనలకు కారణం. అంతా అనుకున్నట్లు జరిగితే, జూన్ నెలలో ద్రవ్యోల్బణం 2.5 శాతం ఉండవచ్చని చెబుతున్నారు. ఇది నిజమైతే, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఆర్బీఐ విజయవంతంగా దూసుకుపోతున్నట్లే.

ఆర్బీఐ లక్ష్యం నెరవేరుతోంది

2022లో 8 శాతం ఉన్న ద్రవ్యోల్బణం, ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ద్రవ్యోల్బణం పరిమితిని 2 శాతం నుంచి 6 శాతానికి మధ్య నిర్ణయించింది. అంటే, ద్రవ్యోల్బణం 2 శాతం కంటే తక్కువకు పడిపోకుండా, 6 శాతం కంటే పెరగకుండా చూసుకోవడం ఆర్బీఐకి అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం.

గత ఏడు నెలలుగా ద్రవ్యోల్బణం 6 శాతం పరిమితిలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే, గత నాలుగు నెలలుగా ఇది 4 శాతం కంటే తక్కువ స్థాయిలోనే నమోదవుతోంది. ద్రవ్యోల్బణం ఇలా అదుపులో ఉండడం వల్ల ఆర్బీఐకి పాలసీ నిర్ణయాలు తీసుకోవడంలో మరింత స్వాతంత్ర్యం లభించింది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం వల్ల, ఇటీవల జరిగిన ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించే ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు. గత నాలుగు నెలల్లో రెపో రేటు 6.50 శాతం నుండి 5.50 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నందువల్లే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోగలిగింది. రెపో రేటు తగ్గింపు వల్ల బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది. మొత్తంగా, ద్రవ్యోల్బణం తగ్గుదల భారత ఆర్థిక వ్యవస్థకు ఒక సానుకూల సంకేతం.

PolitEnt Media

PolitEnt Media

Next Story