ఇరాన్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ నుండి రూ.781 కోట్లు మాయం!

Cyberattack : ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గడం లేదు. రెండు దేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఈ మధ్యే ఇజ్రాయిల్, ఇరాన్‌కు ఒక ఊహించని షాక్ ఇచ్చింది. ఈ షాక్‌తో ఇరాన్‌కు దాదాపు రూ.781 కోట్లు ఒక్క క్షణంలో మాయమయ్యాయి. ఇజ్రాయిల్‌కు చెందిన హ్యాకర్ల బృందం ఇరాన్‌లోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ అయిన 'నోబిటెక్స్' (Nobitex) నుండి తొమ్మిది కోట్ల డాలర్ల (సుమారు రూ.781 కోట్ల) కంటే ఎక్కువ మొత్తాన్ని మాయం చేసింది. బ్లాక్‌చెయిన్ అనాలిసిస్ సంస్థలు చెప్పిన వివరాల ప్రకారం.. ఇజ్రాయిల్‌కు సంబంధించిన హ్యాకర్లు ఈ దాడిని చేసి ఉండవచ్చు.

ఈ హ్యాకింగ్‌కు తామే బాధ్యులమని ప్రకటించిన 'గోంజేష్కే దరాండే' అనే హ్యాకర్ల బృందం, గురువారం నోబిటెక్స్ కంప్లీట్ సోర్స్ కోడ్ వెల్లడించింది. ఈ గ్రూప్ తమ టెలిగ్రామ్ ఖాతాలో, "నోబిటెక్స్‌లో వదిలివేసిన ఆస్తులు ఇప్పుడు పూర్తిగా పబ్లిక్‌గా మారాయి" అని రాసింది. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య గత వారం నుండి కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో ఈ సైబర్ దాడి జరిగింది. బ్లాక్‌చెయిన్ అనాలిసిస్ సంస్థ 'ఎలిప్టిక్' తమ బ్లాగ్‌లో మాట్లాడుతూ, నోబిటెక్స్ నుండి దొంగిలించబడిన డబ్బును ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్‌ను విమర్శించే మెసేజులతో సంబంధం ఉన్న అడ్రస్‌లకు పంపినట్లు పేర్కొంది.

ఈ సైబర్ దాడికి ఆర్థిక ఉద్దేశం కాకుండా రాజకీయ సందేశాన్ని పంపాలనే ఉద్దేశం ఉన్నట్లు ఎలిప్టిక్ పేర్కొంది. నిజానికి, హ్యాకర్లు డబ్బు పంపిన ఖాతాలు, నోబిటెక్స్‌కు ఒక పొలిటికల్ మెసేజ్ పంపడానికి ఈ క్రిప్టోకరెన్సీని పూర్తిగా చెలామణి నుండి తొలగించాయి. హ్యాకర్ల బృందం 'గోంజేష్కే దరాండే' 'ఎక్స్'లో ఈ దాడికి బాధ్యత వహిస్తూ పోస్ట్ చేసింది. నోబిటెక్స్ పశ్చిమ దేశాల ఆంక్షల నుండి తప్పించుకోవడానికి, ఉగ్రవాదులకు నిధులు పంపడానికి ఇరాన్ ప్రభుత్వానికి సహాయపడుతోందని వారు ఆరోపించారు.

నోబిటెక్స్ ఈ దాడిని ధృవీకరించినట్లు తెలుస్తోంది. తమ సిస్టమ్‌లలో అనధికారిక ఎంట్రీని గుర్తించినందున తమ యాప్, వెబ్‌సైట్ పనిచేయడం లేదని ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. చెనాసిస్ సంస్థలోని జాతీయ భద్రతా ఇంటెలిజెన్స్ అధిపతి ఆండ్రూ ఫిర్మన్ మాట్లాడుతూ.. నోబిటెక్స్ ఎక్స్ఛేంజ్‌లో ఉన్న బిట్‌కాయిన్, ఎథెరియం, డాగ్‌కాయిన్, అనేక ఇతర క్రిప్టోకరెన్సీలు ఈ సైబర్ దాడి బారిన పడ్డాయని అన్నారు.

ఇరాన్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ ఉల్లంఘన చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. ఈ మధ్యలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బంధువులు ఈ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌తో సంబంధం కలిగి ఉన్నారు. నిషేధించబడిన రెవల్యూషనరీ గార్డ్ సభ్యులు కూడా నోబిటెక్స్‌ను ఉపయోగించారని ఎలిప్టిక్ పేర్కొంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story