Adani Group : అదానీ గ్రూప్ కట్టిన ట్యాక్సులతో రెండు మూడు సిటీల్లో మెట్రో ప్రాజెక్టులు కంప్లీట్ చేయొచ్చు
మెట్రో ప్రాజెక్టులు కంప్లీట్ చేయొచ్చు

Adani Group : భారత ఆర్థిక వ్యవస్థకు అదానీ గ్రూప్ అందిస్తున్న ఆర్థిక తోడ్పాటు అద్భుతం. దేశంలోనే అత్యధిక పన్నులు చెల్లించే సంస్థల్లో ఒకటిగా నిలుస్తున్న అదానీ గ్రూప్, ప్రభుత్వ ఖజానాకు వేల కోట్లను జమ చేస్తోంది. ఈ పన్నుల మొత్తం దేశంలోని భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి, అభివృద్ధి కార్యక్రమాలకు కీలక వనరుగా మారుతోంది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్, దేశ ఆర్థికాభివృద్ధికి గణనీయమైన తోడ్పాటును అందిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్కు చెందిన వివిధ కంపెనీలు భారత ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ. 74,945 కోట్లు చెల్లించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఈ మొత్తం రూ. 58,104 కోట్లుగా ఉండగా, ఈసారి ఏకంగా 29% వృద్ధిని నమోదు చేసింది. ఇది భారతదేశంలో అత్యధిక పన్నులు చెల్లించే వ్యాపార సమూహాలలో ఒకటిగా అదానీ గ్రూప్ను నిలబెట్టింది.
బెంగళూరు మెట్రో నిర్మాణానికి సరిపడా ట్యాక్సులు
అదానీ గ్రూప్ చెల్లించిన రూ.74,945 కోట్ల ట్యాక్సులు మొత్తంతో బెంగళూరు మెట్రో ప్రాజెక్టు మొదటి, రెండవ, మూడవ దశల నిర్మాణ ఖర్చుకు సమానంగా చెప్పొచ్చు. అంటే, ఒకే వ్యాపార సమూహం నుంచి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, దేశంలోని ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడుతుందో స్పష్టం చేస్తుంది.
అదానీ గ్రూప్ వ్యాపార విస్తరణ, పన్నుల సహకారం!
అదానీ గ్రూప్లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ సిమెంట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ డిఫెన్స్, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ వంటి 10 నుండి 20కి పైగా కంపెనీలు ఉన్నాయి. ఈ అన్ని కంపెనీల నుండి ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్నులు లభిస్తున్నాయి. ముఖ్యంగా, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ సిమెంట్, అదానీ పోర్ట్స్ మరియు అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీలు అత్యధిక పన్నులను చెల్లించాయి. మొత్తం రూ. 74,945 కోట్లలో, రూ. 28,720 కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో మరియు రూ. 45,407 కోట్లు పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరాయి.
దేశంలోని ఇతర అగ్రశ్రేణి పన్ను చెల్లింపుదారులు!
అదానీ గ్రూప్తో పాటు, భారతదేశంలో అత్యధిక పన్నులు చెల్లించే ఇతర ప్రముఖ వ్యాపార సమూహాలు కూడా ఉన్నాయి. టాటా గ్రూప్, దాని 25కి పైగా కంపెనీలతో, 2022-23లోనే దాదాపు రూ. 30,000 కోట్ల పన్నులు చెల్లించింది.అలాగే, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, బిర్లా గ్రూప్, మహీంద్రా, జెఎస్డబ్ల్యు, బజాజ్, వేదాంత, ఎల్ అండ్ టి, గోద్రెజ్, హిందూజా వంటి అనేక ఇతర పెద్ద వ్యాపార సమూహాలు కూడా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల పన్ను ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ భారీ పన్ను వసూళ్లు భారత ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వానికి, దేశాభివృద్ధి కార్యక్రమాలకు వెన్నెముకగా నిలుస్తున్నాయి.
