ఇకపై మైసూర్ పాక్ కాదు... మైసూర్ శ్రీ

పాకిస్థాన్పై కోపాన్ని తనదైన రీతిలో చూపించిన స్వీట్స్'వ్యాపారీ
మైసుర్ పాక్ లో 'పాక్' ఉండటంతో ఆ స్వీట్స్'పేరును 'మైసూరు శ్రీ' గా మార్పు
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత యావత్ భారతదేశమంతా పాకిస్థాన్ పై నిప్పులు చెరుగుతోంది. ఆ దేశానికి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడులు చేయడంతో ఈ ఆగ్రహం కాస్త చల్లారినప్పటికీ.. ఇంకా పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వారు పాకిస్థాన్ పై తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్లోని 'త్యోహార్ స్వీట్స్' దుకాణం వ్యాపారి పాకిస్థాన్ పై తన కోపాన్ని తనదైన రీతిలో చూపించారు. మైసుర్ పాక్ లో పాక్ ఉండటంతో ఆ పదాన్ని తొలగించి స్వీట్ పేరును 'మైసూరు శ్రీ' అని మార్చేశారు. దుకాణ యజమాని అంజలీ జైన్ ఈ వినూత్న ఆలోచన చేశారు. మైసూర్పాక్ తో పాటు తమ దుకాణంలో ఉండే మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్లను కూడా మోతీ శ్రీ, ఆమ్ శ్రీ, గోండ్ శ్రీగా మార్చేశారు. స్వర్ణ భాషం పాక్, చాందీ భాషమ్ పాక్ ను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా అంజలీ మాట్లాడుతూ.. సరిహద్దులోనే దేశభక్త ఉంటే సరిపోదు అని.. ప్రతీ భారతీయుడికి దేశంపై ప్రేమ ఉండాలని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాస్తవానికి 'పాక్' అంటే సంస్కృతంలో 'పండటం' అని అర్థం. చక్కర లేదా బెల్లంతో చేసే పదార్థాన్ని కొన్ని భాషల్లో 'పాకం' అంటారు. దీనికి పాకిస్థాన్ తో సంబంధం లేనప్పటికీ.. పలికే శబ్ధం ఆ దేశాన్ని గుర్తు తెచ్చేలా ఉంటడంతో పేరు మార్చామని.. 'శ్రీ' అనే పదం శుభాన్ని సూచిస్తుందని అంజలీ జైన్ అన్నారు.
