New LTC Rules : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఎల్టీసీ నిబంధనలు మరింత కఠినం
ఎల్టీసీ నిబంధనలు మరింత కఠినం

New LTC Rules : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) కింద విమాన ప్రయాణాల విషయంలో కేంద్ర సర్కార్ షాక్ ఇచ్చింది. ఎల్టీసీ అడ్వాన్స్ క్లెయిమ్లకు సంబంధించి సరికొత్త, కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది. కార్మిక, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ క్యాష్ సెక్షన్ జులై 16, 2026న ఒక అధికారిక సర్క్యులర్ను జారీ చేసింది. ఈ కొత్త ఆదేశాల ప్రకారం ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎల్టీసీ కింద విమాన ప్రయాణ ప్లాన్ చేసుకునేటప్పుడు, అలాగే అడ్వాన్స్ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు కొన్ని కీలక రూల్స్ కచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
చివరి నిమిషంలో టికెట్ల బుకింగ్స్కు చెక్
గతంలో ఉద్యోగులు సమర్పించిన ఎల్టీసీ క్లెయిమ్లను డిపార్ట్మెంట్ నిశితంగా పరిశీలించినప్పుడు ఒక ముఖ్యమైన విషయం బయటపడింది. చాలా మంది అధికారులు, సిబ్బంది తమ ప్రయాణ తేదీకి కేవలం రెండు మూడు రోజుల ముందు లేదా అదే వారంలో విమాన టికెట్లను బుక్ చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా చివరి నిమిషంలో బుకింగ్స్ చేయడం వల్ల విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారీగా అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఈ అనవసరపు ఖర్చులకు, ఫిజూల్ ఖర్చులకు అడ్డుకట్ట వేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపై 30 రోజుల ముందే అప్లై చేయాల్సిందే
కొత్త రూల్స్ ప్రకారం ఎల్టీసీ నియమాలను స్పష్టం చేస్తూ కేంద్రం రెండు ముఖ్యమైన డెడ్లైన్లను పెట్టింది. మొదటిది, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఎల్టీసీ కింద ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటే, వారు ప్రయాణించాలనుకుంటున్న తేదీకి కనీసం 21 రోజుల ముందే విమాన టికెట్లను బుక్ చేసుకోవడం తప్పనిసరి చేశారు. ఇలా ముందే బుక్ చేసుకోవడం వల్ల తక్కువ ధరలకే టికెట్లు దొరుకుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రెండో రూల్ ఏంటంటే, ఒకవేళ ఉద్యోగులు విమాన ప్రయాణం కోసం ప్రభుత్వం నుంచి LTC అడ్వాన్స్ డబ్బులు పొందాలనుకుంటే, వారు ప్రయాణ తేదీకి కనీసం 30 రోజుల ముందే అడ్వాన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి.
ఆఫీషియల్ సర్క్యులర్ జారీ
కేంద్ర ఉద్యోగులు అడ్వాన్స్ కోసం ఇచ్చే అప్లికేషన్ ఫారమ్తో పాటు ప్రభుత్వం గుర్తించిన అధికారిక ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్ నుంచి తీసిన ఫ్లైట్ వివరాలు, టికెట్ ధరల ప్రింటవుట్ను కూడా జత చేయాల్సి ఉంటుంది. అండర్ సెక్రటరీ వినయ్ ప్రతాప్ బహదూర్ సింగ్ డిజిటల్ సంతకంతో విడుదలైన ఈ సర్క్యులర్లో ఈ నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ కొత్త రూల్స్ను ఈ-ఆఫీస్ పోర్టల్ ద్వారా డిపార్ట్మెంట్లోని అందరు అధికారులకు, సిబ్బందికి చేరవేశారు. రూల్స్ బ్రేక్ చేస్తే క్లెయిమ్లు రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

