Petrol Price : దేశంలో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు? సామాన్యుడికి తప్పని వాత
సామాన్యుడికి తప్పని వాత

Petrol Price : మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మండిపోతుండటంతో, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే గ్యాస్ ధరల పెంపుతో బెంబేలెత్తిపోతున్న జనంపై, ఇప్పుడు పెట్రో భారం పడే అవకాశం ఉందని వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా నిలిచిపోవడంతో సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర రికార్డు స్థాయిలో ఒక బ్యారెల్ 100 డాలర్ల మార్కును దాటిపోయింది. ఆయిల్ కంపెనీలు విదేశాల నుంచి భారీ ధరకు చమురును కొనుగోలు చేయాల్సి రావడంతో, ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు దేశీయంగా ధరలను పెంచడం మినహా మరో మార్గం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మే 1వ తేదీ నుండి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ.993 మేర పెంచేసింది. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.3,000 దాటిపోవడం గమనార్హం. ఇదే బాటలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా గ్యాస్ ధరలు పెరిగిన వెంటనే పెట్రోల్ ధరల్లో మార్పులు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి, మన దేశంలో కూడా త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరల వల్ల రోజువారీగా వందల కోట్ల నష్టాలను చవిచూస్తున్నాయి. గత కొంతకాలంగా ఎన్నికలు లేదా ఇతర కారణాలతో ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, ఇకపై వాటిని భరించడం కంపెనీల వల్ల కావడం లేదు. అయితే, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మాత్రం గ్లోబల్ మార్కెట్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, భారత్ ఇప్పటివరకు ధరలను అదుపులో ఉంచిందని, దేశంలో ఇంధన కొరత రానివ్వలేదని చెబుతున్నారు. కానీ పెరుగుతున్న క్రూడ్ ధరలను చూస్తుంటే ప్రభుత్వం ఎంతో కాలం ధరలను నియంత్రించలేదని అర్థమవుతోంది.
ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.5 నుంచి రూ.10 వరకు పెరిగితే, దాని ప్రభావం నిత్యావసర వస్తువులపై కూడా పడుతుంది. రవాణా ఛార్జీలు పెరగడంతో కూరగాయలు, ఇతర సరుకుల ధరలు కూడా భారమవుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ట్రావెలింగ్ చేసే వారికి, రోజూ ఆఫీసులకు వెళ్లే మధ్యతరగతి వారికి ఈ పెట్రో మంటలు చుక్కలు చూపించడం ఖాయం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు త్వరలోనే కొత్త రేట్లను ప్రకటించే అవకాశం ఉన్నందున, వాహనదారులు మానసికంగా సిద్ధపడాల్సిందే.

