PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు వస్తున్నాయ్.. అసలు లిస్టులో మీ పేరు ఉందా ? చెక్ చేసుకోండి!
అసలు లిస్టులో మీ పేరు ఉందా ? చెక్ చేసుకోండి!

PM Kisan : జులై నెల ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత డబ్బుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారికి ఒక గుడ్ న్యూస్. మోడీ ప్రభుత్వం త్వరలోనే రైతులకు రూ.2000 ల తదుపరి విడతను వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయనుంది. ప్రతి సంవత్సరం రూ.6000 ఆర్థిక సహాయాన్ని మూడు విడతలలో కేంద్రం ఈ పథకం కింద రైతులకు అందిస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జూలై 18న బీహార్లోని మోతీహారి పర్యటన సందర్భంగా ఈ విడతను విడుదల చేయవచ్చు. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటివరకు 19 విడతలుగా డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరాయి. చివరి విడత ఫిబ్రవరి 2025లో విడుదలైంది. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కొత్త విడత వస్తుంది. ఈ లెక్కన 20వ విడత జూన్లో రావాల్సి ఉంది.. కానీ ఈసారి కొద్దిగా ఆలస్యం అయింది. ఇప్పుడు వచ్చిన వార్తల ప్రకారం, జులై నెలలో ఈ విడత డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాల్లోకి చేరవచ్చు. పీఎం మోడీ జూలై 18న మోతీహారిలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ విడతను విడుదల చేయవచ్చు. గత సంవత్సరం కూడా పీఎం మోడీ బీహార్ పర్యటనలోనే ఒక విడతను విడుదల చేయడంతో ఈసారి కూడా అదే జరిగే అవకాశం బలంగా కనిపిస్తోంది.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?
మీరు పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులైతే మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు ఆన్లైన్లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి.
* ముందుగా, పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.inకు వెళ్లాలి.
* హోమ్పేజీలో కిందికి స్క్రోల్ చేసి 'ఫార్మర్స్ కార్నర్' విభాగానికి వెళ్లాలి. అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్, గ్రామం పేరును ఎంటర్ చేయాలి.
* ఆ తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి. వెంటనే మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.
ఒకవేళ మీ పేరు ఈ జాబితాలో లేకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ జిల్లాలోని జిల్లా స్థాయి ఫిర్యాదుల పరిష్కార పర్యవేక్షణ కమిటీ ని సంప్రదించవచ్చు. లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోవడం లేదా తప్పు ఎంట్రీలు వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి.
ఒకవేళ పేరు లిస్ట్లో లేకపోతే ఏం చేయాలి?
కొన్నిసార్లు ఆధార్లోని పేరు సరిపోకపోవడం, బ్యాంక్ వివరాలలో లోపాలు లేదా ఈ-కేవైసీ పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల రైతులకు విడత డబ్బులు అందవు. ఒకవేళ మీ పేరు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే, మీరు ఈ క్రింది చర్యలు తీసుకోవచ్చు:
కొత్త రిజిస్ట్రేషన్ : మీరు ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, పీఎం కిసాన్ పోర్టల్లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ను ఎంచుకోండి. ఆధార్ నంబర్, భూమికి సంబంధించిన పత్రాలతో ఫారంను పూరించండి. మీ డేటా వెరిఫికేషన్ కోసం రాష్ట్ర నోడల్ అధికారికి పంపబడుతుంది.
ఆధార్ వివరాలు సరిచేయాలి : ఆధార్లో పేరు లేదా ఇతర వివరాలలో లోపాలు ఉంటే ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ టూల్ను ఉపయోగించాలి. దీని ద్వారా మీరు మీ వివరాలను రియల్ టైంలో అప్డేట్ చేయవచ్చు.
లబ్ధిదారుల స్టేటస్ చెక్ చేయండి : మీ ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఉపయోగించి మీరు తదుపరి విడతకు అర్హులా కాదా అని చెక్ చేసుకోవచ్చు.
ఈ-కేవైసీ, బ్యాంక్ వివరాలు అప్డేట్ చేయడం తప్పనిసరి
రైతులు తమ ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాలని, బ్యాంక్ వివరాలు, మొబైల్ నంబర్, ఆధార్తో అనుసంధానించబడిన సమాచారాన్ని అప్డేట్గా ఉంచుకోవాలని సలహా ఇస్తారు. ఈ-కేవైసీ లేకుండా ఏ రైతుకు కూడా కిస్తీ డబ్బులు అందవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ-కేవైసీ కోసం మీరు పీఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ-ఆధారిత ప్రక్రియను ఉపయోగించవచ్చు. అదే విధంగా, మీ ఆధార్ మీ బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్కు లింక్ అయిందని నిర్ధారించుకోండి. ఏదైనా సమస్యలు వస్తే, మీరు పీఎం కిసాన్ హెల్ప్లైన్ నంబర్ 155261 లేదా 1800-115-5261 కు సంప్రదించవచ్చు.
మీరు ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే, మీ జిల్లాలోని నోడల్ అధికారిని సంప్రదించవచ్చు. దీని కోసం:
* పీఎం కిసాన్ వెబ్సైట్ కు వెళ్లాలి.
* ఫైండ్ యువర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ (PoC) ఆప్షన్పై క్లిక్ చేయండి.
* డిస్ట్రిక్ట్ నోడల్ సెర్చ్ ను ఎంచుకుని మీ రాష్ట్రం, జిల్లాను నమోదు చేయండి.
* అప్పుడు మీకు అధికారి పేరు, పదవి, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ వివరాలు అందుబాటులో ఉంటాయి.
