నేడే పీఎం కిసాన్ 20వ విడుత డబ్బులు

PM Kisan : దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం. ఈ పథకం కింద 20వ విడత నిధులను కేంద్రం నేడు అంటే శనివారం (ఆగస్టు 2) విడుదల చేయనుంది. ఈ డబ్బులు నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. మొత్తం 9.7 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి రూ.20,500 కోట్లు విడుదల కానున్నాయి. ఒక్కో రైతుకు రూ.2,000 చొప్పున ఈ సహాయం అందుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 11 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేస్తారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.

2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ డబ్బును మూడు విడతల్లో, అంటే ఒక్కో విడతకు రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఇప్పటివరకు 19 విడతలుగా మొత్తం రూ.3.69 లక్షల కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం వల్ల దేశంలోని కోట్లాది మంది రైతులకు ఎంతో మేలు జరుగుతోంది.

మీ పేరు బెనిఫిషరీ లిస్ట్‌లో ఉందో లేదో ఇలా తెలుసుకోండి

పీఎం కిసాన్ పథకంలో లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. ఈ క్రింది పద్ధతిని అనుసరించి మీ పేరును చెక్ చేసుకోండి.

* ముందుగా, పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ను ఓపెన్ చేయండి.

* హోమ్ పేజీలో కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే 'Farmers Corner' అనే విభాగం కనిపిస్తుంది.

* అందులో 'Beneficiary List' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

* తర్వాత మీ రాష్ట్రం, జిల్లా, తాలూకా, గ్రామాన్ని ఎంచుకుని 'Get Report' లేదా 'Fetch Data' బటన్‌ను నొక్కండి.

* ఇప్పుడు మీరు ఎంచుకున్న గ్రామంలో అర్హులైన రైతుల జాబితా కనిపిస్తుంది. ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోండి.

ఒకవేళ మీ పేరు జాబితాలో ఉండి, మీకు డబ్బులు రాకపోతే కొన్ని కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా, ఇ-కేవైసీ పూర్తి చేయకపోవడం, లేదా మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం వంటివి ప్రధాన కారణాలు. ఇలాంటి సమస్యలు ఉంటే, వెంటనే మీ సమీపంలోని రైతు సహాయ కేంద్రం లేదా అగ్రికల్చర్ ఆఫీసర్‌ను సంప్రదించి పరిష్కరించుకోండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story