PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. నేడు పీఎం కిసాన్ 20వ విడత రిలీజ్ ?
నేడు పీఎం కిసాన్ 20వ విడత రిలీజ్ ?

PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో 19 విడతల డబ్బును జమ చేసింది. ఇప్పుడు 20వ విడత డబ్బు విడుదల కానుంది. ఈ నెలలో ఎప్పుడైనా 20వ విడత రూ.2,000 రైతుల ఖాతాల్లోకి రావొచ్చు. ఒక నివేదిక ప్రకారం.. జులై 18, శుక్రవారం నాడు పీఎం కిసాన్ పథకం 20వ విడత డబ్బు విడుదలయ్యే అవకాశం ఉంది. బీహార్లోని ఈస్ట్ చంపారన్లోని మోతిహరిలో నేడు ఒక భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 20వ విడత డబ్బును విడుదల చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా నివేదించింది.
గతంలో, 2024 జూన్లో 17వ విడత, అక్టోబర్లో 18వ విడత, 2025 ఫిబ్రవరిలో 19వ విడత డబ్బును విడుదల చేశారు. 16వ విడత డబ్బును ప్రధానమంత్రి బెళగావిలో జరిగిన ఒక సభలో విడుదల చేశారు. ఇప్పటివరకు 12 కోట్లకు పైగా రైతులు పీఎం కిసాన్ పథకంలో నమోదు చేసుకున్నారు. ఈ-కేవైసీ చేయకపోవడం, అనర్హత వంటి కారణాల వల్ల లబ్ధిదారులైన రైతుల సంఖ్య తగ్గింది. 19వ విడత డబ్బును 9.8 కోట్ల మంది రైతులు అందుకున్నారు. ఈసారి 20వ విడత డబ్బు అందుకునే వారి సంఖ్య 10 కోట్లు దాటవచ్చు అని అంచనా వేస్తున్నారు.
రైతుల వ్యవసాయ అవసరాలకు తోడ్పాటుగా ప్రభుత్వం ఏటా రూ.6,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ డబ్బును సంవత్సరంలో మూడు విడతల్లో, ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున అందిస్తారు. 2019లో ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటివరకు 19 విడతలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం రైతుల ఆర్థిక స్థిరత్వానికి గణనీయంగా తోడ్పడుతుంది.
