RBI: దేశంలో ఆహార, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, ఆర్‌బిఐ రెపో రేటును ఎందుకు పెంచలేదనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. తాజాగా విడుదలైన ఆగస్టు ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) భేటీ మినిట్స్ దీనికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించాయి. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణే నయమని ఆర్‌బిఐ నిర్ణయించింది. ఆర్‌బిఐ కీలకమైన వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆగస్టు 3 నుంచి 5 వరకు ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన ఎంపీసీ సమావేశంలో ఆరుగురు సభ్యులూ రెపో రేటును 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచడానికి ఓటు వేశారు. వరసగా నాలుగో భేటీలోనూ వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగడం గమనార్హం. నిత్యావసరాలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉన్నప్పటికీ, ఆ ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై ఇంకా విస్తరించలేదని కమిటీ భావించింది. అందుకే తొందరపడి రేట్లు పెంచకుండా పరిణామాలను గమనించాలని నిర్ణయించుకుంది.

క్రూడాయిల్ భయాలు

సమావేశం వివరాలను వెల్లడిస్తూ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అంతర్జాతీయ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల సరుకుల రవాణా వ్యవస్థ దెబ్బతింటోందని, ఇది క్రూడ్ ఆయిల్ సహా ఇంధన ధరల మంటకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి తోడు రుతుపవనాల తీరు, అల్ నినో ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయ ఉత్పత్తిని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకవేళ ఆహార, ఇంధన ధరల మంట ఇతర రంగాలు, సేవలకూ వ్యాపిస్తే ఆర్‌బిఐ కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, వడ్డీ రేట్లు పెంచేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు.

ఉపశమనం ఇస్తున్న దేశీయ వృద్ధి

బాహ్య సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడటం ఉపశమనం కలిగిస్తోంది. ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి త్రైమాసికంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. దేశీయంగా వినియోగం పెరగడం, పెట్టుబడులు, ఎగుమతులు పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నాయి. ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్, ఎంపీసీ సభ్యురాలు పూనమ్ గుప్తా కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. సరఫరా వ్యవస్థల సమస్యలు, వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని, ప్రస్తుతానికి వేచి చూడటమే సరైన విధానమని ఆమె వ్యాఖ్యానించారు.

అక్టోబర్‌ సమావేశంలోనే అసలు నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం ఆర్‌బిఐకి ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచాలని లక్ష్యంగా నిర్దేశించింది. విపరీత పరిస్థితుల్లో ఇది 2 శాతం నుంచి 6 శాతం పరిమితిలో ఉండవచ్చు. ప్రస్తుతానికి ద్రవ్యోల్బణ ఒత్తిడి అదుపులోనే ఉన్నందున ఆర్‌బిఐ తక్షణ నిర్ణయాలు తీసుకోలేదు. తదుపరి ఎంపీసీ సమావేశం అక్టోబర్ 5 నుంచి 7 తేదీల మధ్య జరగనుంది. ఆ సమయానికి రాబోయే కొత్త గణాంకాలు, వర్షపాతం, ముడి చమురు ధరలను బట్టి వడ్డీ రేట్లపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story