ఇక బ్యాంక్ పనులన్నీ ఇంటి నుంచే !

RBI's New KYC Rules: బ్యాంక్ అంటే కేవైసీ, కేవైసీ అంటే బ్యాంక్‌కు వెళ్లడం, క్యూలో నిలబడటం, సిబ్బందితో మాట్లాడటం... ఇదంతా చాలా మంది కష్టంగా భావిస్తుంటారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని ముఖ్యమైన కేవైసీ నియమాల్లో పెద్ద మార్పులు తీసుకొచ్చింది. ఈ రోజు (జూన్ 12, 2025) నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త నియమాలు బ్యాంకింగ్ ప్రక్రియలను మరింత సులభతరం చేయనున్నాయి. 2025 నాటి ఆర్బీఐ కేవైసీ సవరణ ఆదేశాల ద్వారా, ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ, విడియో కేవైసీ, డిజిలాకర్ డాక్యుమెంట్ల వాడకం వంటి ప్రక్రియలను సరళీకరించారు.

ఆర్బీఐ ఈ నియమాలను మార్చడం వెనుక ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. మొదటిసారి బ్యాంక్ ఖాతా తెరిచే వారికి, ముఖ్యంగా డిజిటి (Direct Benefit Transfer) వంటి ప్రభుత్వ పథకాల కోసం బ్యాంక్ ఖాతా తెరిచే వారికి ప్రక్రియ కష్టంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కేవైసీ నియమాలను సవరించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా బ్యాంకింగ్ సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయి.

కొత్త నియమాల ప్రకారం బ్యాంక్ ఖాతా తెరవడానికి బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోటు నుంచే ఆధార్ ఓటీపీ ఆధారితంగా ఇ-కేవైసీ చేసుకోవచ్చు. బ్యాంకులు డిజిలాకర్‌లో ఉన్న పత్రాలు లేదా ఇ-డాక్యుమెంట్లను కూడా అంగీకరిస్తాయి. ఈ పద్ధతిలో బ్యాంక్ ఖాతా తెరిస్తే, ఒక సంవత్సరం లోపు దాని సిడిడి (Customer Due Diligence)ని పూర్తి చేయాలి. అంటే, కస్టమర్‌లు ఒక్కసారైనా బ్యాంక్‌కు స్వయంగా వెళ్లి కేవైసీని ధృవీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధార్‌లో ఉన్న చిరునామా వేరే అయితే, చింతించాల్సిన అవసరం లేదు, ఒక సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పిస్తే సరిపోతుంది.

ఇకపై విడియో ఆధారితంగా కస్టమర్‌ల గుర్తింపును ధృవీకరించే ప్రక్రియకు (వి-సిఐపి) ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అంటే, బ్యాంక్ ప్రతినిధి విడియో కాల్ ద్వారా కస్టమర్‌లను సంప్రదించి నేరుగా కేవైసీ వెరిఫికేషన్ చేయవచ్చు. ఈ విడియో పద్ధతి బ్యాంక్ కు నేరుగా వెళ్లి బ్యాంక్ ఖాతా తెరిచినట్లే చెల్లుతుంది. కొత్త ఖాతా తెరవడానికి లేదా ఇప్పటికే ఉన్న ఖాతా కేవైసీని అప్‌డేట్ చేయడానికి కూడా ఈ విడియో కేవైసీ మెథడ్ ఉపయోగించవచ్చు.

కస్టమర్‌లు ఇప్పటికే వేరే బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉంటే, వారి కేవైసీ డాక్యుమెంట్స్ కేంద్ర కేవైసీ రిజిస్ట్రీలో నమోదై ఉంటాయి. వీరు మరో బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు మళ్లీ కేవైసీ పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రీలో ఉన్న కస్టమర్ల కేవైసీ పత్రాలను ఆ బ్యాంక్ పొందవచ్చు. దీనివల్ల కొత్త ఖాతా తెరచే ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. కస్టమర్‌ల సమయం ఆదా అవుతుంది. ఈ మార్పులతో పాటు, బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కువ మంది ప్రజలను చేరుకోవడానికి, ముఖ్యంగా గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో బ్యాంక్ ఖాతాల సంఖ్యను పెంచడానికి బ్యాంకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆర్బీఐ సూచించింది. ఈ కొత్త నియమాలు భారతదేశ డిజిటల్ బ్యాంకింగ్ విప్లవానికి మరింత ఊపునిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story