Investment Tips: సంపాదించిన డబ్బును పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రావడం ఖాయం. రోజుకు కేవలం రూ. 100 ఆదా చేసేవారికి బ్యాంకులు, పోస్టాఫీసులు పలు రకాల పథకాలను అందిస్తున్నాయి. అయితే ఆర్‌డీ, మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీ, పిపిఎఫ్ లలో దేనిలో పెట్టుబడి పెడితే అత్యధిక రాబడి లభిస్తుందో వివరంగా తెలుసుకుందాం.

చిన్న మొత్తాల పొదుపుకు రికరింగ్ డిపాజిట్ (RD)

బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండే రికరింగ్ డిపాజిట్ చిన్న తరహా ఇన్వెస్టర్లకు చాలా అనుకూలమైన మార్గం. రోజువారీగా లేదా వారాంతాల్లో చిన్న మొత్తాలను దాచుకోవాలనుకునే వారు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. బ్యాంకులు ఈ ఆర్‌డీ పథకాలపై దాదాపు 6 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. రోజుకు రూ.100 లేదా వారానికి రూ.700 వంతున పొదుపు చేసుకుంటూ వెళ్తే నిర్ణీత కాల వ్యవధి పూర్తయ్యాక హామీతో కూడిన రాబడిని పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

మ్యూచువల్ ఫండ్స్‌లో రోజువారీ ఎస్‌ఐపీ (SIP)

ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిలో రోజువారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ విధానం ద్వారా నిత్యం రూ.100 చొప్పున పెట్టుబడి పెట్టవచ్చు. డబ్బులు కట్టడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా సొమ్ము కట్ అయ్యే వెసులుబాటు ఉంటుంది. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్ వృద్ధిని బట్టి ఇది ఆర్‌డీ, పిపిఎఫ్ కంటే అత్యధిక రాబడిని అందించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ప్రభుత్వ భరోసాతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

సురక్షితమైన రాబడి కోరుకునే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒక అద్భుతమైన మార్గం. పిపిఎఫ్ ఖాతాలో రోజూ డబ్బులు వేయడం కుదరకపోవచ్చు. ప్రతిరోజూ రూ. 100 చొప్పున పక్కన పెట్టి, నెలకు రూ.3,000 చొప్పున ఖాతాలో జమ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకానికి ప్రభుత్వం 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. చక్రవడ్డీ లభించడంతో పాటు పన్ను మినహాయింపులు కూడా ఉండటం వల్ల దీర్ఘకాలిక భవిష్యత్తు అవసరాలకు పిపిఎఫ్ అద్భుతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది.

Next Story