GST Collection May 2025 : దేశంలో జీఎస్టీ (Goods and Services Tax) వసూళ్లు మరోసారి అద్భుతమైన రికార్డును క్రియేట్ చేశాయి. మే నెలలో జీఎస్టీ వసూళ్లు 16.4 శాతం పెరిగి రూ.2.01 లక్షల కోట్లకు పైగా చేరాయి. ఇది దేశంలో మూడోసారి జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటడం. గత ఏప్రిల్‌లో రూ.2.37 లక్షల కోట్లతో ఆల్‌టైమ్ రికార్డు నమోదైన సంగతి తెలిసిందే. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే కాలంలో మొత్తం జీఎస్టీ ఆదాయం రూ.4,37,767 కోట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే కాలంలో నమోదైన రూ.3,83,006 కోట్ల కంటే 14.3 శాతం ఎక్కువ. అలాగే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.22 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 9.4 శాతం ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం స్థూల ఆదాయం రూ.20.18 లక్షల కోట్లు.

* 17శాతం నుండి 25శాతం వృద్ధి: మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్లలో 17 శాతం నుండి 25 శాతం వరకు వృద్ధిని నమోదు చేశాయి.

* 6శాతం వరకు వృద్ధి: గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి పెద్ద రాష్ట్రాలు ఆరు శాతం వరకు వృద్ధిని చూపించాయి.

* సగటున 10శాతం వృద్ధి: మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లలో సగటున 10 శాతం వృద్ధి నమోదైంది.

మూడోసారి రూ.2లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది మూడోసారి. 2024 ఏప్రిల్‌లో తొలిసారిగా అత్యధికంగా రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. అప్పటి నుండి కొత్త రికార్డులు నెలకొల్పుతూనే ఉన్నాయి. ఈ నెలలో మొత్తం రీఫండ్‌లు నాలుగు శాతం తగ్గి రూ.27,210 కోట్లకు చేరాయి.

వార్షిక ప్రాతిపదికన 16శాతానికి పైగా వృద్ధి

2024 మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.72,739 కోట్లుగా నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే.. 2025 మే నెలలో జీఎస్టీ ఆదాయంలో 16.4 శాతం వేగవంతమైన వృద్ధి కనిపించింది. గణాంకాల ప్రకారం..మే నెలలో దేశీయ లావాదేవీల నుండి మొత్తం GST ఆదాయం 13.7 శాతం పెరిగి దాదాపు రూ.1.50 లక్షల కోట్లకు చేరింది. కాగా, దిగుమతుల నుండి GST వసూళ్లు 25.2 శాతం పెరిగి రూ.51,266 కోట్లకు చేరాయి. మే నెలలో మొత్తం కేంద్ర GST ఆదాయం రూ.35,434 కోట్లు, రాష్ట్ర GST ఆదాయం రూ.43,902 కోట్లు, ఇంటిగ్రేటెడ్ GST వసూళ్లు దాదాపు రూ.1.09 లక్షల కోట్లుగా ఉన్నాయి. సెస్ నుండి ఆదాయం రూ.12,879 కోట్లుగా ఉంది.

PolitEnt Desk

PolitEnt Desk

Next Story