PMJJBY : రూ.436 ప్రీమియంతో రూ. 2 లక్షల బీమా.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గొప్ప అవకాశం
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గొప్ప అవకాశం

PMJJBY : దేశంలోని కోట్లాది మంది ప్రజలను బీమా పరిధిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(PMJJBY)ను ప్రారంభించింది. ఈ పదేళ్లలో కోట్లాది మంది ఈ బీమా పథకంలో చేరి లబ్ధి పొందారు. ఇది చాలా తక్కువ ధరకే లభించే బీమా పథకం కాబట్టి, పేదలు కూడా పాలసీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ పథకం పూర్తి వివరాలు, ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఏ వాణిజ్య బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసుకు వెళ్ళైనా జీవన్ జ్యోతి బీమా యోజనను తీసుకోవచ్చు. బీమా చేయించుకునే వారి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు. మీకు బ్యాంక్ ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటే, దాని ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. ఒక వ్యక్తికి ఎన్ని ఖాతాలు ఉన్నప్పటికీ కేవలం ఒక ఖాతా ద్వారా మాత్రమే PMJJBY ప్లాన్ను పొందగలరు. ఇది ప్రభుత్వం మద్దతు ఇచ్చే బీమా పథకం అయినప్పటికీ ప్రీమియంకు మాత్రం ప్రభుత్వ సహకారం ఉండదు..అంటే ప్రీమియంను లబ్ధిదారుడే పూర్తిగా చెల్లించాలి.
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది ఒక సంవత్సరం కాలపరిమితి గల పాలసీ. అంటే, ప్రతి సంవత్సరం ఈ పాలసీని రెన్యూవల్ చేసుకోవాలి. దీనికి సంవత్సరానికి రూ.436 ప్రీమియం ఉంటుంది. ప్రతి సంవత్సరం మీరు ప్రీమియం చెల్లించి పాలసీని రెన్యూవల్ చేసుకోవచ్చు, లేదా ఆటో డెబిట్ (Auto-debit) అయ్యేలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
పాలసీదారుడు మరణించినట్లయితే తన కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం లభిస్తుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఈ పాలసీ రెన్యూవల్ అవుతుంది. మీరు కొత్తగా పాలసీ తీసుకుంటున్నట్లయితే మీరు ఏ నెలలో డబ్బు చెల్లిస్తారు అనే దానిపై మొదటి ప్రీమియం ఆధారపడి ఉంటుంది.
తొలి ప్రీమియం ఎలా లెక్కిస్తారు?
ఉదాహరణకు: జూన్, జూలై ,ఆగస్టు నెలల్లో జీవన్ జ్యోతి బీమా పాలసీ తీసుకుంటే మొదటి వాయిదా రూ.436 ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్రోల్ అయితే ప్రీమియం రూ.342 అవుతుంది.డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో అయితే రూ.228.అలాగే, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కొనుగోలు చేస్తే రూ.114 ప్రీమియం ఉంటుంది.పైన పేర్కొన్నవి కేవలం మొదటి ప్రీమియంలు మాత్రమే. మీరు రెండో సంవత్సరంలో పాలసీని రెన్యూవల్ చేసేటప్పుడు మాత్రం పూర్తి రూ.436 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.ఈ పథకం దేశంలోని కోట్లాది మందికి ఆర్థిక భద్రతను అందిస్తోంది.
