Strait Of Hormuz: అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ ప్రపంచ ఇంధన రంగానికి అతిపెద్ద ఊరటనిచ్చే వార్త బయటకు వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ముడిచమురు రవాణా మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‎ను తిరిగి సురక్షితంగా తెరిచేందుకు ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఒక సముద్ర ఒప్పంద చట్రం సిద్ధమైంది. ఈ మార్గం పూర్తిగా అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా పెరిగి, భారత్ సహా అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

ఇరాన్-ఒమన్ చర్చలు కొలిక్కి

ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని ఇరాన్ పార్లమెంటరీ జాతీయ భద్రతా కమిటీ ప్రతినిధి హసన్ ఘష్ఘావి వెల్లడించారు. ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు, తుది నిబంధనలను త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ ఒప్పందానికి ఇరాన్ అత్యున్నత నాయకత్వం నుంచి తుది ఆమోదం లభించాల్సి ఉంది. తాత్కాలికంగా కేటాయించిన మార్గాల ద్వారా నౌకల రాకపోకలకు ఎలాంటి ముందస్తు అనుమతులు లేదా ప్రత్యేక రుసుములు అవసరం లేదని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

నౌకల నియంత్రణ ఎవరి చేతుల్లో?

ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే నౌకల నియంత్రణ అధికారాలు ఇరాన్ చేతిలో ఉండేలా ప్రణాళిక రచించారు. ఇక బయటకు వెళ్లే నౌకల భద్రత, పర్యవేక్షణను ఇరాన్, ఒమన్ దేశాలు సంయుక్తంగా చేపడతాయి. నౌకల రవాణా కోసం ఒకే ప్రధాన కారిడార్‌ను నిర్ణయించనున్నారు. అమెరికా విధిస్తున్న సముద్ర దిగ్బంధాన్ని ఎత్తివేస్తేనే ఈ మార్గాన్ని సంపూర్ణంగా పూర్తిస్థాయిలో తెరుస్తామని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాదీ స్పష్టం చేశారు.

తగ్గుముఖం పట్టనున్న ఇంధన ధరలు

ఈ మార్గం పునరుద్ధరణతో క్రూడ్ ఆయిల్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి అవసరమైన మొత్తం ఇంధన ఉత్పత్తులలో దాదాపు 20 శాతం రవాణా అవుతుంది. ఉద్రిక్తతల కారణంగా గతంలో సరఫరా తగ్గినప్పటికీ, ఇప్పుడు పూర్తిస్థాయిలో నౌకల రాకపోకలు మొదలైతే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలపై ఒత్తిడి తగ్గి, పెట్రోల్ రేట్లు దిగివచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story