Donald Trump : ఒక్క మాటతో ప్రపంచ మార్కెట్లను వణికించిన ట్రంప్.. ఇంతకు ఏమన్నాడంటే ?
ఇంతకు ఏమన్నాడంటే ?

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక చిన్న వ్యాఖ్య ప్రపంచ మార్కెట్లలో పెద్ద కలకలం సృష్టించింది. ట్రంప్ "టెహ్రాన్ను ఖాళీ చేయండి" అని అనడం వల్ల మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా దాదాపు 2శాతం పెరిగాయి. ఈ వ్యాఖ్య ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలకు గండి కొట్టింది. దీంతో మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. అమెరికన్ ఫ్యూచర్స్ మార్కెట్లలో కూడా పతనం కనిపించింది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్య ప్రభావం భారత్పైనా పడుతుంది. ఎందుకంటే చమురు ధరలు పెరిగితే, భారత్కు తీవ్ర నష్టం వాటిల్లవచ్చు.
ట్రంప్ కెనడాలోని అల్బెర్టాలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా సోషల్ మీడియా పోస్ట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా చెప్పలేదు. దీనికి ముందు ఇరాన్ ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటుందని ట్రంప్ అన్నారు. కానీ అతని తాజా ప్రకటన తర్వాత, చమురు ధరలు అమాంతం పెరిగాయి. చమురు ధరల పెరుగుదల ప్రభావం భారతదేశం వంటి దేశాలపై తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే మనం మన చమురు అవసరాలలో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటాము. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చమురు ధరలు పెరుగుతూ పోతే, భారతదేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి, రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇది సామాన్యుల జేబుపై భారం పెంచడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని, అమెరికా ఇజ్రాయెల్ దాడులలో జోక్యం చేసుకోకపోతే, అణ్వాయుధ చర్చలను మళ్లీ ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని టెహ్రాన్ సంకేతాలు ఇచ్చింది. రాయిటర్స్ నివేదికలో కూడా ఇరాన్ ఈ సందేశాన్ని ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ ద్వారా పంపిందని పేర్కొంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరిమితంగా ఉంటే, మార్కెట్లపై దాని ప్రభావం పెద్దగా ఉండదు. అయితే, ట్రంప్ చేసిన వ్యాఖ్య, పెరుగుతున్న చమురు ధరలు భారతదేశం వంటి దిగుమతిపై ఆధారపడే దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వస్తువుల ధరలు పెరిగి, సామాన్యుడి బడ్జెట్ అదుపు తప్పుతుంది.
