Gaddar Awards: గద్దర్ అవార్డుల కోసం 90 సినిమాలు పోటీ
90 సినిమాలు పోటీ

Gaddar Awards: హైదరాబాద్ నగరం కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా, దేశంలోని అన్ని భాషల చిత్ర పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా (National Hub) మారాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల' (Gaddar Film Awards) స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. ప్రజా గాయకుడు గద్దర్ స్మారకార్థం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో .. ముంబై, చెన్నై, కోల్కతా వంటి నగరాల్లో సినిమా రంగం విస్తరించడానికి స్థలం లేదని, కానీ హైదరాబాద్లో అద్భుతమైన వాతావరణం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ,మెరుగైన శాంతిభద్రతలు ఉన్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ను అంతర్జాతీయ సినిమా రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన బ్లూ ప్రింట్తో ముందుకెళ్తోందని తెలిపారు. కళను, గళాన్ని సామాజిక మార్పు కోసం ఆయుధంగా మలుచుకున్న మహనీయుడు గద్దర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను గౌరవించేందుకే ఈ అవార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.అవార్డులకు ఎంపిక చేసే సినిమాల్లో కేవలం కమర్షియల్ అంశాలే కాకుండా, సామాజిక సందేశం (Social Message) కూడా ఉండాలని జ్యూరీ సభ్యులకు సూచించారు. ఇది భవిష్యత్తులో మంచి సినిమాలు రావడానికి దోహదపడుతుందని అన్నారు.
అవార్డుల నిర్వహణ , పారదర్శకత
అవార్డుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం లేకుండా, కేవలం ప్రతిభ ఆధారంగానే అత్యంత పారదర్శకంగా ఎంపిక జరగాలని స్పష్టం చేశారు. జ్యూరీ చైర్మన్ మణిశర్మ ,ఇతర సభ్యులకు ఈ మేరకు సూచనలు చేశారు.
ఈ స్క్రీనింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 6న ప్రారంభమైందని, ఎంపికైన విజేతలకు మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. "సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా మా తలుపు తట్టవచ్చు" అని చెబుతూ, చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్రాజు, జ్యూరీ చైర్మన్ మణిశర్మ ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. గద్దర్ అవార్డుల కోసం మొత్తం 90 సినిమాలు పోటీ పడుతుండగా, అందులో 68 ఫీచర్ ఫిల్మ్స్ (Feature Films) ఉన్నాయి. మిగిలినవి లఘు చిత్రాలు (Short Films). కేవలం ఒక్క ఏడాదికే కాకుండా, గతంలో పెండింగ్లో ఉన్న సంవత్సరాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న సినిమాలను స్క్రీనింగ్ చేసి, అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేయడం ఒక సవాల్తో కూడిన పని అని, అందుకే జ్యూరీ సభ్యులు (మణిశర్మ నేతృత్వంలో) నిరంతరం శ్రమిస్తున్నారని అని అన్నారు.

