సుధా కొంగర డ్రీమ్ ప్రాజెక్ట్

Sudha Kongara’s Dream Project: ప్రముఖ మహిళా దర్శకురాలు సుధా కొంగర, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సినిమా చేయాలనే తన చిరకాల వాంఛను తాజాగా బయటపెట్టారు. భావోద్వేగపూరితమైన కథలను తెరకెక్కించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న ఆమె, రజనీతో ఒక మనసుకు హత్తుకునే సందేశాత్మక చిత్రాన్ని రూపొందించాలని కోరుకుంటున్నారు.

తాజాగా తన సినిమా 'పరాశక్తి' ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో సుధా కొంగర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్‌ను కేవలం యాక్షన్ హీరోగానే కాకుండా, అద్భుతమైన నటుడిగా ఆమె చూస్తానని చెప్పారు. అందుకే ఆయనతో ఒక స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన ప్రేమకథను తీయడమే తన జీవిత ఆశయమని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా 1985లో వచ్చిన క్లాసిక్ సినిమా 'ముదల్ మరియాదై' (Muthal Mariyathai) తరహాలో ఒక పరిణతి చెందిన ప్రేమకథను ఆయనతో చేయాలని ఉందని ఆమె పేర్కొన్నారు.

రజనీకాంత్ కోసం ఇప్పటికే తన వద్ద ఒక కథ సిద్ధంగా ఉందని, అయితే దాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని సుధా తెలిపారు. "నాకు లవ్ స్టోరీలంటే చాలా ఇష్టం. రజనీ సర్‌ను పూర్తి కొత్త కోణంలో చూపించే కథ నా దగ్గర ఉంది. ఆయనలోని సున్నితమైన భావాలను, వెచ్చని నటనను ప్రేక్షకులు మళ్ళీ చూడాలని నా కోరిక" అని ఆమె వివరించారు. ఈ కల నిజమైతే రజనీకాంత్ కెరీర్‌లో ఇదొక విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇదే ఇంటర్వ్యూలో సుధా కొంగర తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. వరుస ప్రాజెక్టులతో తాను చాలా అలసిపోయానని, అందుకే త్వరగా రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే రిటైర్ అయ్యేలోపు రజనీకాంత్‌తో ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నది ఆమె బలమైన కోరిక. ప్రస్తుతం ఆమె దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన 'పరాశక్తి' చిత్రం 2026 జనవరి 10న విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story