బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. పలు సక్సెస్‌ఫుల్‌ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మృతి బాలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముకుల్ దేవ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన ఆయన స్నేహితులు శనివారం ఉదయమే ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన సన్నిహితురాలు, నటి దీపశిఖా నాగ్‌పాల్ ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ముకుల్ దేవ్‌తో ఉన్న పాత ఫోటోను షేర్‌ చేస్తూ "RIP" అని పేర్కొన్నారు. ముకుల్ దేవ్, ప్రముఖ నటుడు రాహుల్ దేవ్‌కు సోదరుడు.

న్యూఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించిన ముకుల్ దేవ్ తండ్రి హరి దేవ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారు. ఆయన ద్వారానే ముకుల్ దేవ్‌కు ఆఫ్ఘన్ సంస్కృతి పరిచయమైంది. ఆయన తండ్రి పష్తో, పర్షియన్ భాషలు మాట్లాడగలిగేవారు. అంతేకాకుండా, ముకుల్ దేవ్ ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ నుంచి పైలట్‌గా కూడా శిక్షణ పొందారు.

నటనపై ఆసక్తితో ముకుల్ దేవ్ ఎనిమిదో తరగతిలోనే తొలి పారితోషికం అందుకున్నారు. దూరదర్శన్ నిర్వహించిన ఓ డ్యాన్స్ షోలో మైఖేల్ జాక్సన్‌ను అనుకరించి ఆయన ఈ గుర్తింపు పొందారు. 1996లో 'ముమ్కిన్' అనే టెలివిజన్ సీరియల్‌లో విజయ్ పాండే పాత్రతో నటనారంగంలోకి అడుగుపెట్టారు. దూరదర్శన్‌లో ప్రసారమైన 'ఏక్ సే బధ్ కర్ ఏక్' అనే కామెడీ బాలీవుడ్ కౌంట్‌డౌన్ షోలో కూడా ఆయన నటించారు. 'ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా' మొదటి సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఇక సినిమాల విషయానికొస్తే, 'దస్తక్' చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. ఈ సినిమాలో ఏసీపీ రోహిత్ మల్హోత్రా పాత్రలో ఆయన నటించారు. ఈ చిత్రంతోనే మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ కూడా వెండితెరకు పరిచయమయ్యారు.

ముకుల్‌దేవ్‌.. మరణ వార్త టాలీవుడ్‌లోనూ విషాదం నింపింది. ‘సింహాద్రి’, ‘సీతయ్య’, ‘మాస్‌’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రాహుల్‌ దేవ్‌ సోదరుడు ముకుల్‌. ఆయన బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు, పంజాబీ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. రవితేజ హీరోగా నటించిన ‘కృష్ణ’తో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత ‘కేడి’, ‘అదుర్స్‌’, ‘సిద్ధం’, ‘మనీ మనీ మోర్‌ మనీ’, ‘నిప్పు’, ‘భాయ్‌’ చిత్రాల్లో నటించారు. 2022లో విడుదలైన ‘అంత్‌ ది ఎండ్‌’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు.

ముకుల్‌ దేవ్‌ మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ టాలీవుడ్‌ హీరో ఎన్టీఆర్‌ సంతాపం తెలిపారు. ‘‘ముకుల్‌ మరణించడం బాధాకరం. ‘అదుర్స్’లో ఆయనతోపాటు వర్క్‌ చేసినప్పుడు ఆయన నిబద్ధత తెలిసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా’’ అని ఎక్స్‌లో విచారం వ్యక్తం చేశారు.



Politent News Web4

Politent News Web4

Next Story