Actress Varalakshmi Sarathkumar: విలక్షణ నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో కీలక అడుగు వేశారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, ఇకపై దర్శకనిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు.

తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ పేరుతో వరలక్ష్మి సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ కొత్త బ్యానర్‌పై తొలి చిత్రంగా సరస్వతి అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

హై-ఆక్టేన్ థ్రిల్లర్‌గా 'సరస్వతి'

ఈ చిత్రానికి వరలక్ష్మి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలోనూ నటిస్తుండటం విశేషం. సరస్వతి సినిమా ఒక హై-ఆక్టేన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనుంది. విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లో సరస్వతి పేరులోని తి అక్షరాన్ని ఎరుపు రంగులో హైలైట్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భారీ తారాగణం పాలుపంచుకుంటోంది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, నటి ప్రియమణి, యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. .

తన కొత్త ప్రయాణం గురించి వరలక్ష్మి స్పందిస్తూ.. "దోస డైరీస్ మొదటి పేజీ సరస్వతి మీ ముందుకు రాబోతుంది. మా ప్రయాణం ఈరోజు ప్రారంభమైంది. రాబోయే పేజీలు మరింత ప్రకాశవంతంగా ఉంటాయి" అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

Next Story