ముంబై : బాలీవుడ్‌లో నటీనటుల సంక్షేమం, హక్కుల కోసం పనిచేస్తున్న CINTAA (Cine & TV Artistes' Association)లో కొనసాగుతున్న వివాదం మరింత ముదిరింది. ఒకవైపు ప్రస్తుత కమిటీపై ఆరోపణలు, మరోవైపు ఎన్నికల ప్రక్రియ, ఆర్థిక వ్యవహారాలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకాలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. CINTAA అధ్యక్షురాలు 'పూనమ్ ధిల్లాన్', ప‌ద్మిని కొల్హాపురే, టీనా ఘై, సీపీ ఠాకూర్, జయ భట్టాచార్య తదితరులు తొలిసారి తమ వాదనను విపులంగా వెల్లడించారు.



జర్నలిస్ట్ 'లిపికా వర్మ'తో జరిగిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ప్రస్తుత వివాదంపై వారు పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా హైకోర్టు ఆదేశాలు, CINTAA ఎన్నికలు, కమిటీ కొనసాగింపు, రూ.18 కోట్ల నిధులు, CAWT వ్యవహారం, షోకాజ్ నోటీసులు, వ్యక్తిగత ఆరోపణలపై తమ వివరణ ఇచ్చారు.


'పబ్లిక్‌గా ఇలా మాట్లాడటం బాధాకరం'.. పూనమ్ ధిల్లాన్

CINTAAలో వ్యక్తిగత ఆరోపణలు, మడ్‌స్లింగింగ్‌పై పూనమ్ ధిల్లాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తమతో కొన్ని నెలల క్రితం వరకు కలిసి పనిచేసినవారే ఇప్పుడు బహిరంగంగా ఆరోపణలు చేయడం బాధాకరంగా ఉందన్నారు. CINTAA అనేది కేవలం 21 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు సంబంధించిన సంస్థ కాదని.. దాదాపు ''9 వేల మంది నటీనటులకు ప్రాతినిధ్యం వహించే సంస్థ'' అని తెలిపారు.

వ్యక్తిగత విభేదాలను మీడియా ముందుకు తీసుకురావడం వల్ల మొత్తం CINTAA కుటుంబం ఇబ్బందిపడుతుందని పూనమ్ ధిల్లాన్ పేర్కొన్నారు.

మేం వ్యక్తిగతంగా కాదు.. CINTAA తరఫున మాట్లాడుతున్నాం

తమపై అబద్ధాలు చెప్పారంటూ వస్తున్న ఆరోపణలపై ప‌ద్మిని కొల్హాపురే స్పందిస్తూ.. తాము వ్యక్తిగత హోదాలో నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు.

తాము ''CINTAA తరఫునే'' వ్యవహరిస్తున్నామని తెలిపారు. తమకు అనుకూలంగా హైకోర్టు నుంచి కీలకమైన ఆర్డర్ వచ్చిందని.. ఆ ఆర్డర్‌లో తమపై వచ్చిన పలు ఆరోపణలకు సంబంధించి విషయాలు స్పష్టమయ్యాయని చెప్పారు.

CINTAA ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఫలితాలు కోర్టు తీర్పుకు లోబడి!

కోర్టు ఆదేశాలపై సీపీ ఠాకూర్ వివరణ ఇచ్చారు. ఎన్నికలు ఇప్పటికే చాలా ముందుకు వెళ్లిపోయాయని, నామినేషన్లు, పరిశీలన, తుది జాబితా వంటి ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు.

ఎన్నికలను మధ్యలో నిలిపివేయడం సముచితం కాదనే ఉద్దేశంతో కోర్టు ఎన్నికలకు స్టే ఇవ్వలేదని చెప్పారు.

అయితే CINTAA ఎన్నికలను నిర్వహించే ''అధికారం లేదా జ్యూరిస్‌డిక్షన్ ఫెడరేషన్‌కు ఉందా లేదా'' అన్నది ప్రధాన సివిల్ కేసులో తేలాల్సి ఉందన్నారు.

ఎన్నికలు జరిగి ఫలితాలు ప్రకటించినా.. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు విజేతలు పదవులు చేపట్టలేరని పూనమ్ ధిల్లాన్ తెలిపారు.

తదుపరి విచారణ అక్టోబర్ 26, 2026న జరగనుంది.

'మా కమిటీ రద్దు కాలేదు.. అక్టోబర్ 26 వరకు కొనసాగుతాం'

తమ కమిటీ రద్దయిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని పూనమ్ ధిల్లాన్ ఖండించారు.

'మా కమిటీ డిసాల్వ్ కాలేదు. తదుపరి విచారణ తేదీ అయిన 26.10.2026 వరకు మేం కొనసాగుతాం' అని ఆమె స్పష్టం చేశారు.

అంతేకాదు.. ఎన్నికల ఫలితాలు వచ్చినా, ప్రధాన కేసులో కోర్టు తుది నిర్ణయం వచ్చే వరకు పరిస్థితి మారదని పేర్కొన్నారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీలో కొత్త సభ్యుల నియామకం ఎలా జరిగింది?

కొత్త సభ్యులను ఎంచుకోవడంలో పక్షపాతం జరిగిందన్న ఆరోపణలపై పూనమ్ ధిల్లాన్ వివరణ ఇచ్చారు.

CINTAA రాజ్యాంగంలోనే దీనికి సంబంధించిన నిబంధన ఉందని చెప్పారు. ఎన్నికైన సభ్యుడు రాజీనామా చేసినా లేదా ఏదైనా కారణంతో స్థానం ఖాళీ అయినా.. తదుపరి అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిని కమిటీలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు.

గత కమిటీలోనూ ఇదే నిబంధన ప్రకారం బిందు, హెటల్ పర్మార్ వంటి వారు కమిటీలోకి వచ్చారని పూనమ్ గుర్తుచేశారు.

ఎవరినీ వ్యక్తిగతంగా తీసుకురాలేదు

కొత్త సభ్యుల ఎంపికలో తమ వ్యక్తిగత పరిచయాలు పనిచేయలేదని పూనమ్ ధిల్లాన్ తెలిపారు.

రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారమే ఖాళీలను భర్తీ చేశామని.. ఇందులో ఎలాంటి ఫేవరిటిజం లేదన్నారు. కొత్తగా వచ్చిన సభ్యులకు అనుభవం ఉందని, అది CINTAAకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

CINTAA ఆఫీస్ వివాదంపై టీనా ఘై వివరణ

CINTAA కార్యాలయం సమీపంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపైనా టీనా ఘై స్పందించారు.

ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి CINTAAకు సంబంధించిన సామగ్రిని తరలిస్తున్న సమయంలో వివాదం ఏర్పడిందని తెలిపారు. ఓ వాహనాన్ని మరో వాహనం ముందు నిలిపివేయడంతో.. సామగ్రిని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయని చెప్పారు.

ఈ వ్యవహారంలో పోలీసులు కూడా అక్కడికి వచ్చారని.. అయితే పోలీసులు ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనే విషయాన్ని నిర్ణయించబోమని స్పష్టంగా చెప్పారని టీనా తెలిపారు. వారి బాధ్యత కేవలం లా అండ్ ఆర్డర్‌ను కాపాడటమేనని వివరించారు.

CINTAA నిధుల దుర్వినియోగం జరిగితే ఆధారాలు చూపాలి

ఆర్థిక అవకతవకల ఆరోపణలను పూనమ్ ధిల్లాన్ తీవ్రంగా ఖండించారు.

మీడియా ముందు ఎవరైనా ఆరోపణలు చేయవచ్చని.. కానీ తమపై ఆధారాలు ఉంటే వాటిని బయటపెట్టాలని అన్నారు. CINTAA నిధులు బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారానే నిర్వహించబడ్డాయని, ఆన్‌లైన్ పేమెంట్లు, అధీకృత సంతకాలు వంటి వ్యవస్థలు ఉన్నాయని వివరించారు.

రూ.1.74 కోట్ల నిధులపై ప‌ద్మిని వివరణ

CINTAA కోసం గతంలో సేకరించిన నిధులపై ప‌ద్మిని కొల్హాపురే మాట్లాడుతూ.. 2010–11 ప్రాంతంలో డబ్బు సేకరణ ప్రారంభమైందని తెలిపారు.

2025 నాటికి సుమారు ''రూ.1.74 కోట్లు సేకరించబడినట్లు వివరించారు. ఈ నిధులు సరైన బ్యాంకింగ్ ప్రక్రియల ద్వారానే నిర్వహించబడ్డాయని తెలిపారు.

CINTAA బిల్డింగ్ ఇంటీరియర్స్‌పై ఎందుకు అభ్యంతరం

CINTAA బిల్డింగ్ ఇంటీరియర్స్, ఇనాగరేషన్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేయడంపై తాము అభ్యంతరం వ్యక్తం చేశామని ప‌ద్మిని తెలిపారు.

ఇంటీరియర్స్ కోసం సుమారు 'రూ.1.75 కోట్లు', ఇనాగరేషన్ కోసం మరో 'రూ.25 లక్షలు' ఖర్చు చేయాలనే ప్రతిపాదనపై ప్రశ్నలు లేవనెత్తామని చెప్పారు.

CINTAA సభ్యుల నుంచి వచ్చే డబ్బును మార్బుల్, గ్రానైట్, ఏసీ వంటి ఖర్చులకు సరైన ప్రక్రియ లేకుండా వినియోగించకూడదని తాము భావించామని తెలిపారు.

సభ్యుల వార్షిక ఫీజు కేవలం రూ.1,200

CINTAA నిధులను కాపాడటానికి తాము ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నామో పూనమ్ ధిల్లాన్ వివరించారు.

CINTAA సభ్యత్వ ఫీజు ఏడాదికి కేవలం 'రూ.1,200' మాత్రమేనని చెప్పారు. కరోనా సమయంలో చాలామంది నటీనటులు ఆ మొత్తాన్ని కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు.

అందుకే ఫీజు చెల్లించలేని సభ్యులను తిరిగి సంస్థలోకి తీసుకురావడానికి అమ్నెస్టీ స్కీమ్ తీసుకొచ్చామని.. సభ్యత్వం ద్వారా మెడికల్, ఫైనాన్షియల్ వంటి సంక్షేమ ప్రయోజనాలు అందుతాయని చెప్పారు.

ప్రమాదానికి గురైన సభ్యుడికి సాయం చేయడం ఫైనాన్షియల్ మిస్‌యూజ్ కాదు

సభ్యులకు ఇచ్చిన పరిహారంపై వస్తున్న ఆరోపణలపై జయ భట్టాచార్య స్పందించారు.

పని సమయంలో ప్రమాదానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే నటీనటులకు అసోసియేషన్ నిబంధనల ప్రకారం సాయం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.

టీనా ఘైకు కూడా గాయం కారణంగా చాలా కాలం ఫిజియోథెరపీ అవసరమైందని, ఆమె కుమార్తెకు సైకాలజికల్ థెరపీ అవసరమైన సందర్భంలోనూ పరిస్థితిని అర్థం చేసుకోవాలని తెలిపారు.

షోకాజ్ నోటీసులపై పూనమ్ సంచలన వ్యాఖ్యలు

షోకాజ్ నోటీసుల వ్యవహారంపై పూనమ్ ధిల్లాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు షోకాజ్ నోటీసుల గురించి మాట్లాడుతున్న వారే.. గతంలో ఆ ప్రక్రియను ప్రారంభించడంలో భాగస్వాములయ్యారని ఆరోపించారు.

తాము నటీనటులమని, లాయర్లు కాదని.. మొదట్లో షోకాజ్ నోటీస్ అంటే ఏమిటో కూడా తమకు పూర్తిగా తెలియదని చెప్పారు.

కొంతమంది చెప్పినట్టే చేయాలని ఒత్తిడి వచ్చింది

CINTAA కమిటీ ఎలా పనిచేయాలనే విషయంలో కొంతమంది తమపై ప్రభావం చూపాలని ప్రయత్నించారని పూనమ్ తెలిపారు.

ఎవరిని కమిటీలోకి తీసుకోవాలి, కొన్ని వ్యవహారాలను ఎలా నిర్వహించాలి అనే విషయంలో సూచనలు వచ్చాయని చెప్పారు.

అయితే CINTAA బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వతంత్రంగా పనిచేయాలని నిర్ణయించుకున్నామని.. నటీనటుల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రూ.18 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?

CINTAA వద్ద ఉన్నట్లు చెబుతున్న ''రూ.18 కోట్ల నిధులపై'' కూడా పూనమ్ ధిల్లాన్ స్పష్టత ఇచ్చారు.

ఆ డబ్బు CINTAAకు, దాని సభ్యులకు చెందినదేనని.. అది సురక్షితంగా ఉందని తెలిపారు. 1958లో ప్రారంభమైన సంస్థ ఎన్నో సంవత్సరాలుగా పొదుపు, ఆర్థిక నిర్వహణ ద్వారా ఈ నిధులను సమకూర్చుకుందని వివరించారు.

CINTAA నిధులను ఇతర అవసరాలకు వినియోగించకుండా సభ్యుల సంక్షేమం కోసమే కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

CAWTపై అసలు అభ్యంతరం ఏంటి?

CAWTపై తమ ప్రధాన అభ్యంతరం.. CINTAA నటీనటుల సంక్షేమం కోసం నిధులు సమీకరించి, అవసరమైన సమయంలో వారికి సహాయం చేయాల్సిన స్థాయిలో పనిచేయడం లేదన్నదేనని పూనమ్ తెలిపారు.

ప్రమాదాలు, అనారోగ్యం వంటి సంక్షోభ సమయంలో సభ్యులు సాయం కోసం వచ్చినప్పుడు.. ట్రస్ట్ నుంచి సహాయం పొందడంలో ఆలస్యం జరుగుతోందని తమకు అనిపించిందన్నారు.

ట్రస్ట్ పాత్రను తొలగించడం తమ ఉద్దేశం కాదని.. అది మరింత సమర్థవంతంగా పనిచేసి CINTAA కళాకారులకు అండగా ఉండాలని కోరుకున్నామని తెలిపారు.

ఎన్నికల్లో ఓడిపోవచ్చు.. కానీ వ్యక్తిగత శత్రుత్వం అవసరం లేదు

చివరగా వ్యక్తిగత ఆరోపణలు, మడ్‌స్లింగింగ్‌పై టీనా ఘై మాట్లాడుతూ.. అభిప్రాయ భేదాలు సహజమేనని అన్నారు.

ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ఓడిపోవచ్చు, గెలవచ్చు.. కానీ దాని తర్వాత కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు.

పూనమ్ ధిల్లాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్నేహితుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయని.. స్నేహం అంటే ప్రతి విషయంలో ఏకీభవించడం కాదని చెప్పారు.

'వ్యక్తిగత విభేదాలను మీడియా ముందుకు తీసుకెళ్లి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవద్దు. CINTAA వేలాది మంది నటీనటులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. సంస్థను బలోపేతం చేయడం, సభ్యుల సంక్షేమం కోసం పనిచేయడమే అందరి ప్రధాన లక్ష్యం కావాలి' అని పూనమ్ ధిల్లాన్ అన్నారు.

కోర్టు ఆర్డర్‌పై క్లారిటీ ఇదే..

ప్రస్తుత పరిస్థితిపై వారి వివరణ ప్రకారం..

'CINTAA డిసాఫిలియేషన్ చెల్లుబాటు అయ్యిందా లేదా అన్నది' కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

CINTAA ఎన్నికలు నిర్వహించే అధికారం ఎవరికి ఉందన్నది 'ప్రధాన కేసులో తేలాల్సి ఉంది.'

ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే నామినేషన్, స్క్రూటినీ, తుది జాబితా వరకు వెళ్లడంతో ఎన్నికలకు కోర్టు స్టే ఇవ్వలేదు.

ఎన్నికలు జరిగి ఫలితాలు ప్రకటించినా.. అవి సివిల్ సూట్‌లో వచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయి.

తదుపరి విచారణ 'అక్టోబర్ 26, 2026'న జరగనుంది.

Chamber Summons, Notice of Motion అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

ఇక పూనమ్ ధిల్లాన్ స్పష్టం చేసిన అంశం ఒక్కటే.. 'మా కమిటీ రద్దు కాలేదు. తదుపరి విచారణ తేదీ వరకు మేం కొనసాగుతాం.'

అసలు CINTAAలో ఎవరి వాదనకు కోర్టు మద్దతు లభిస్తుంది? ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా మారుతుంది? అనే అంశాలపై ఇప్పుడు అక్టోబర్ 26 విచారణపై ఆసక్తి నెలకొంది.

Updated On
Next Story