Keerthy Suresh Expresses Deep Distress: డీప్ఫేక్ కష్టాలు..కీర్తి సురేశ్ తీవ్ర ఆవేదన
కీర్తి సురేశ్ తీవ్ర ఆవేదన

Keerthy Suresh Expresses Deep Distress: ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ తన పేరుతో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న AI మార్ఫింగ్ చిత్రాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డీప్ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన ఈ నకిలీ ఫొటోలు తనను మానసికంగా ఎంతగానో బాధిస్తున్నాయని, విసుగు పుట్టిస్తున్నాయని ఆమె సోషల్ మీడియా వేదికగా వాపోయారు.
నిజమా? అబద్ధమా?
కీర్తి సురేశ్ మాట్లాడుతూ..ఈ నకిలీ చిత్రాలు ఎంత సహజంగా ఉన్నాయంటే, వాటిని చూసినప్పుడు నిజంగానే తను అలా ఫోజు ఇచ్చానా? అని తనను తానే ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. "AI సాంకేతికత ఎంత ప్రమాదకరంగా మారుతోందో చెప్పడానికి ఇదే నిదర్శనం" అని ఆమె పేర్కొన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఈ టెక్నాలజీ సామర్థ్యాలను నియంత్రించడం కష్టంగా మారుతోందని కీర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
కఠిన చర్యలు అవసరం
అనుమతి లేకుండా ఇతరుల చిత్రాలను ఇలా దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కీర్తి సురేశ్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్య కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాదని, డిజిటల్ ప్లాట్ఫామ్లు ఉపయోగించే ప్రతి ఒక్కరికీ ముప్పు పొంచి ఉందని ఆమె హెచ్చరించారు.
కీర్తి ఆవేదనకు తోటి నటి ఆండ్రియా జెరెమియా మద్దతు తెలిపారు. గతంలో రష్మిక మందన్న, సమంత వంటి నటీమణులు కూడా ఇలాంటి డీప్ఫేక్ సమస్యను ఎదుర్కొన్నారు. ఈ వరుస ఘటనలు AI దుర్వినియోగంపై మరింత కఠినమైన చట్టాలు, నియంత్రణల అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి.

