Emotional Statement from Manchu Lakshmi: మంచు కుటుంబంలో గత కొంతకాలంగా జరుగుతున్న అంతర్గత విభేదాలపై నటి నిర్మాత మంచు లక్ష్మి తొలిసారిగా పెదవి విప్పారు. తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, కుటుంబం పట్ల తనకున్న ప్రేమను, ఆ సమయంలో తాను అనుభవించిన బాధను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబంలో ఎటువంటి సమస్యలు వచ్చినా అంతిమంగా అందరూ ఒక్కటిగా ఉండాలనేదే తన ఆకాంక్ష అని మంచు లక్ష్మి తెలిపారు. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే.."నా కుటుంబం అంతా మళ్లీ సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటాను. ప్రతి కుటుంబంలో గొడవలు సహజమే, కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా అందరూ ఒక్కటిగా ఉండాలి" అని అన్నారు. భారతీయ కుటుంబాల్లోని మొండి వైఖరిని ప్రస్తావిస్తూ, గొడవలు వచ్చినప్పుడు శాశ్వతంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం సరికాదన్నారు. "కష్టకాలంలో మనకు అండగా నిలిచేది రక్తసంబంధీకులే. వారితో కలిసి ఉండటానికి ఎంతటి పోరాటమైనా చేయాలి కానీ, దూరం పెంచుకోకూడదు" అని బంధాల విలువను వివరించారు.

మౌనం వెనుక వేదన

కుటుంబ వివాదాలు జరుగుతున్నప్పుడు తాను ముంబైలో ఉన్నందున బాధపడలేదనే ప్రచారాలు జరిగాయని, అయితే ఆ సమయంలో తాను తీవ్రమైన మానసిక వేదన అనుభవించానని మంచు లక్ష్మి స్పష్టం చేశారు. తన బాధను బహిరంగంగా ప్రదర్శించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే ఆ సమయంలో మౌనంగా ఉన్నట్లు ఆమె వివరించారు.

వ్యక్తిగత విషయాలపై ఇంటర్వ్యూలు ఇవ్వడానికి తాను సాధారణంగా ఇష్టపడనని తెలిపిన లక్ష్మి.. చివరగా ఒక తల్లిగా తన బాధ్యతల గురించి మాట్లాడుతూ 10కి 10 మార్కులు వేసుకుంటానని గర్వంగా ప్రకటించారు.

Next Story