నిర్మాతల హామీలతో వెనక్కి తగ్గిన ఎగ్జిబిటర్లు

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ధియేటర్లను మూసేయాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా ఎగ్జిబిటర్లు వాయిదా వేసుకున్నారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉదయం నుంచి వాడి వేడి చర్చలు జరిగాయి. జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయంపై చర్చలు జరిపారు. ఉదయం 11 గంటలకు తెలుగు రాష్ట్రాలలోని డిస్ట్రిబ్యూటర్స్ తో సమావేశమైన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించింది. ఈ సమావేశానికి 40 మంది హాజరయ్యారు. సాయంత్రం 4 గంటలకు తెలుగు ప్రొడ్యూసర్స్ తో తెలుగు ఫిలిం ఛాంబర్ సమావేశమయింది. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దు, థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో క్యూబ్ సమస్యలపై కొన్ని రోజులు థియేటర్లు మూసిేశారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లపై షూటింగుల నిలిపివేశారు. ఈ రెండు విషయాల్లోనూ సత్ఫలితాలు రాకపోవడంతో, ఈ సారి థియేటర్లు మూతపడకుండా, సినిమాలు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని స్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే పైరసీ, ఐపిఎల్, ఓటీటీ రూపంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా తగ్గింది. మే 30 నుంచి వరుస సినిమాలు ఉండటంతో మరింత ఇబ్బంది అవుతుంది కాబట్టి, థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకుని తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించే విధంగా తోడ్పడాలని ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కోరారు. దీంతో వారు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఆదాయ పంపిణీపై వివాదం కొొనసాగుతోంది. రెంటల్ విధానంలో సినిమాలను ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్స్ అంటున్నారు. వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్స్ తేల్చిచెప్పారు. దీంతో ఇరువురి మధ్య ఆ సమస్య అలాగే ఉండిపోయింది. జూన్లో భారీ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ 'హరిహర వీరమల్లు' జూన్ 12న రిలీజ్ కానుంది. అటు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలు పోషించిన అవెయిటెడ్ మూవీ 'కుబేర' జూన్ 20న రిలీజ్ కానుంది. ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సైతం జూన్ 27న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ భారీ సినిమాల సీజన్ ను మిస్సయితే ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతారు. అందుకే ఇప్పుడున్న విధానంలో ప్రస్తుతం కంటిన్యూ చేస్తూ భవిష్యత్ లో చర్చలు జరపాలన్న సలహాలు ఇచ్చారు. దానికి ఎగ్జిబిటర్లు అంగీకరించారు.
