Varinder Singh Passes Away: ప్రముఖ నటుడు, బాడీబిల్డర్ వరీందర్ సింగ్ కన్నుమూత
బాడీబిల్డర్ వరీందర్ సింగ్ కన్నుమూత

Varinder Singh Passes Away: పంజాబీ సినీ ప్రపంచంలో, భారతీయ బాడీబిల్డింగ్ రంగంలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు మరియు అంతర్జాతీయ బాడీబిల్డర్ వరీందర్ సింగ్ ఘుమన్ (42) గుండెపోటుతో (Cardiac Arrest) అకాల మరణం చెందారు. బుధవారం (అక్టోబర్ 9, 2025) సాయంత్రం అమృత్సర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. వరీందర్ సింగ్ ఘుమన్ భుజం నొప్పి కారణంగా సాధారణ పరీక్షలు, చికిత్స కోసం అమృత్సర్లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన మేనేజర్ మరియు బంధువులు తెలిపారు. అయితే, చికిత్స జరుగుతుండగా, ఊహించని విధంగా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది ఎంత ప్రయత్నించినా, ఆయనను కాపాడలేకపోయారు.
వరీందర్ సింగ్ ఘుమన్ కేవలం నటుడిగానే కాక, భారతీయ ఫిట్నెస్ ప్రపంచంలో ఒక దిగ్గజంగా పేరు పొందారు. మాంసాహారంపై ఆధారపడే బాడీబిల్డింగ్ రంగంలో, ప్రపంచంలోనే మొట్టమొదటి శాఖాహార ప్రొఫెషనల్ బాడీబిల్డర్గా ఆయన గుర్తింపు పొందారు. 2009లో ‘మిస్టర్ ఇండియా’ టైటిల్ గెలుచుకోవడమే కాక,మిస్టర్ ఆసియాలో రన్నరప్గా నిలిచారు. ఆయన అద్భుతమైన కండలు, శాఖాహార జీవనశైలి హాలీవుడ్ నటుడు, బాడీబిల్డింగ్ లెజెండ్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఆర్నాల్డ్ తన ఆరోగ్య ఉత్పత్తుల బ్రాండ్ను ఆసియాలో ప్రచారం చేయడానికి వరీందర్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు.
బాడీబిల్డింగ్లో శిఖరం చేరుకున్న తర్వాత, వరీందర్ సింగ్ ఘుమన్ సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన తొలిసారిగా 2012లో పంజాబీ చిత్రం కబడ్డీ వన్స్ ఎగైన్ లో ప్రధాన పాత్ర పోషించారు. హిందీలో ‘రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్’ (2014), ‘మర్జావాన్’ (2019) వంటి చిత్రాలలో నటించారు. 2023లో విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం టైగర్ 3లో కీలక పాత్ర పోషించి మరింత గుర్తింపు పొందారు.ఆయన ఆకస్మిక మరణం పంజాబ్ రాజకీయ నాయకులతో పాటు సినీ, ఫిట్నెస్ కమ్యూనిటీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన క్రమశిక్షణ, కృషి యువతకు ఎప్పుడూ ఆదర్శప్రాయమని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
