“The Raja Saab”: ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ధరల పెంపు ఉత్తర్వులను (Memo) నిలిపివేస్తూ శుక్రవారం (జనవరి 9, 2026) ఆదేశాలు జారీ చేసింది.సినిమా టికెట్ ధరలను పెంచుతూ హోంశాఖ జారీ చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీనివల్ల థియేటర్లలో టికెట్లను పాత ధరలకే విక్రయించాల్సి ఉంటుంది. "సినిమా టికెట్ ధరలు పెంచబోమని ఒకవైపు మంత్రి చెబుతుంటే, మరోవైపు అధికారులు తెలివిగా మెమోలు ఎలా జారీ చేస్తున్నారు?" అని న్యాయస్థానం ప్రశ్నించింది.

టికెట్ ధరల పెంపు లేదా బెనిఫిట్ షోల అనుమతిపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం జిల్లా కలెక్టర్లకు లేదా హైదరాబాద్‌లో పోలీస్ కమిషనర్‌కు మాత్రమే ఉంటుందని, హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రతి పెద్ద సినిమాకు ఇలా ధరలు పెంచడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ఇది కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధమని జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.

ప్రభుత్వం తొలుత జారీ చేసిన మెమో ప్రకారం జనవరి 9 నుంచి- 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్‌లలో రూ.132 అదనంగా పెంచుకోవచ్చు. జనవరి 12 -నుంచి18 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్‌లలో రూ.89 అదనంగా పెంచుకోవచ్చు. ఈ పెంపు ద్వారా వచ్చే లాభాల్లో 20% మొత్తాన్ని ఫిలిం ఫెడరేషన్‌కు (సినీ కార్మికుల సంక్షేమం కోసం) ఇవ్వాలని సూచించింది. హైకోర్టు తాజా తీర్పుతో బుకింగ్ యాప్స్ (BookMyShow వంటివి) థియేటర్ యాజమాన్యాలు పెంచిన ధరలను తగ్గించి, పాత రేట్లకే టికెట్లు అమ్మాలని కోర్టు ఆదేశించింది. ఇది భారీ బడ్జెట్ చిత్రమైన 'రాజాసాబ్' వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story