‘Jana Nayagan’: తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్‌ నటుడిగా కనిపించనున్న చివరి చిత్రం జన నాయగన్‌ విడుదలపై గత కొన్ని నెలలుగా నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ఈ భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామాను జులై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో రిలీజ్ పోస్టర్‌ను పంచుకుంది. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

3 గంటల రన్‌టైమ్.. 12 కట్స్‌తో ఏ సర్టిఫికేట్:

ఇటీవలే ఈ చిత్రానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) నుంచి సర్టిఫికేట్ ప్రక్రియ పూర్తయింది. జులై 9న పూర్తయిన ఈ ప్రక్రియలో బోర్డు సినిమాకు ఏ సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. చిత్రంలో ఉన్న కొన్ని తీవ్రమైన యాక్షన్ ఎపిసోడ్స్, పొలిటికల్ డైలాగ్స్ కారణంగా సెన్సార్ బోర్డు దాదాపు 12 మార్పులు సూచించినట్లు, చిత్రబృందం ఆ మార్పులు చేసిన తర్వాతే సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాల 11 సెకన్లుగా నమోదైంది.

తమిళనాడులో నో మార్నింగ్ షోస్.. తెలుగు రాష్ట్రాల్లో 5 AM నుంచే?

తమిళనాడులోని విజయ్ అభిమానులకు ఈ సినిమా షో టైమింగ్స్ కాస్త నిరాశ కలిగించే విషయమే అని చెప్పాలి. అక్కడ ఈ చిత్రానికి ప్రత్యేకంగా ఉదయం 5 గంటల షోలకు అనుమతి ఉండదని తెలుస్తోంది. తొలి ప్రదర్శన ఉదయం 9 గంటలకే ప్రారంభం కానుంది. అయితే, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలలో మాత్రం ఉదయం 5 గంటల నుంచే తెల్లవారుజామున షోలు పడే అవకాశం ఉందని సమాచారం. దీనిపై మేకర్స్ నుండి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

భారీ తారాగణం – క్రేజీ కాంబినేషన్:

సంచలన దర్శకుడు హెచ్‌. వినోద్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో విజయ్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే టాలెంటెడ్ బ్యూటీ మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. విజయ్ కెరీర్‌లో 69వ చిత్రంగా, నటుడిగా ఆయనకు ఇదే చివరి సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story