కమల్ హాసన్ లేఖ

Kamal Haasan: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన ధరల పెరుగుదల, ఆర్థిక అనిశ్చితితో దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన 'పొదుపు' పిలుపును.. చిత్ర పరిశ్రమ కూడా పాటించాల్సిన సమయం వచ్చిందన్నారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవాలంటూ ఇండస్ట్రీ వర్గాలకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ లేఖ రాశారు.
కమల్ హాసన్ తన లేఖలో ఏమన్నారంటే..? పెరుగుతున్న ధరల వల్ల సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. భవిష్యత్తులో ప్రేక్షకులు వినోదం కోసం చేసే ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. అందుకే.. మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి కేవలం ఆడంబరాల కోసం కాకుండా, సినిమా నాణ్యత పెంచేలా ఉండాలి.సినిమా ఆర్థిక వ్యవస్థలో మార్పులు చేసినప్పుడు.. సామాన్య కార్మికుల వేతనాలు, వారి భద్రత, ఆహారం, వసతి విషయంలో ఎలాంటి కోత విధించకూడదు. ప్రతి ప్రేమకథ పారిస్లోనే పుట్టాలా? ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్లోనే ముగియాలా? అని కమల్ హాసన్ ప్రశ్నించారు. ప్రేమకు విదేశీ మారకద్రవ్యం అవసరం లేదని.. దేశీయంగానే అద్భుతమైన లొకేషన్లలో తక్కువ ఖర్చుతో సినిమాలు తీయవచ్చని సూచించారు.
ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి నిర్మాతలు, నటీనటులు, దర్శకులు, యూనియన్లు, ఓటీటీ ప్లాట్ఫామ్లు అంతా ఒకే తాటిపైకి రావాలని కమల్ పిలుపునిచ్చారు. పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి చర్చలు జరపాలని ఆయన స్పష్టం చేశారు.

