‘Mirzapur: ప్రముఖ వెబ్‌ సిరీస్‌ మిర్జాపూర్‌ ఇప్పుడు వెండితెరపైకి వస్తోంది. ఈ సిరీస్‌ ఆధారంగా తెరకెక్కిన మిర్జాపూర్‌: ది మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. క్రైమ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్‌ 4, 2026న థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందే ఈ సినిమాకు బుకింగ్స్‌ జోరుగా సాగుతున్నాయి. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటివరకు దేశంలోని ప్రముఖ నేషనల్‌ థియేటర్‌ చైన్స్‌ అయిన PVR, INOX, Cinepolisలో కలిపి 30 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

ఈ బుకింగ్స్‌ ఇదే స్థాయిలో కొనసాగితే సినిమా మొదటి రోజే భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిర్జాపూర్‌: ది మూవీ తొలి రోజు దాదాపు రూ.25 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా. ఓటీటీ నుంచి థియేటర్లలోకి వస్తున్న సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్‌ రావడం మంచి విషయంగా ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ సినిమాకు గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, అమెజాన్‌ MGM స్టూడియోస్‌ కలిసి సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, దివ్యేందు, రసికా దుగల్‌, శ్వేతా త్రిపాఠి శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ‘మిర్జాపూర్‌’ వెబ్‌ సిరీస్‌కు భారీగా అభిమానులు ఉండటంతో.. అదే క్రేజ్‌ సినిమాకు కూడా కలిసొస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది.

ఓటీటీలో సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్‌’ కథ వెండితెరపై ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ముందస్తు బుకింగ్స్‌ చూస్తుంటే ఈ సినిమా భారీ ఓపెనింగ్‌ అందుకునేలా కనిపిస్తోంది.

Next Story