Nandamuri Balakrishna: సినీ నటుడు మరియు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పదవులు తనకు ముఖ్యం కాదని, వాటికే తాను అలంకారమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అఖండ-2 సినిమాను మంచి ఉద్దేశంతో తీశామని చెప్పారు. ఈ చిత్రాన్ని కులాలకు ఆపాదించకుండా హిందూ ధర్మానికి ప్రతిరూపంగా తెరకెక్కించామని వివరించారు.


"పద్మభూషణ్ మరియు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం నా అదృష్టం. నా సినీ విజయాలను ప్రజల విజయాలుగా భావిస్తున్నా. పదవులు నాకు ముఖ్యం కాదు, వాటికే నేను అలంకారమని నా భావన. ఈ విజయాలను తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నా. తండ్రి, గురువు, దేవుడిగా ఎన్టీఆర్ నాకు ప్రతిరూపం. ఎన్టీఆర్ దరిదాపులకు చేరాలన్నదే నా లక్ష్యం. తల్లి బసవతారకం చేసిన త్యాగాలు, సహకారం మరువలేనిది. హిందూపురం ఎమ్మెల్యేగా రాయలసీమను నా అడ్డాగా భావిస్తా," అని బాలకృష్ణ పేర్కొన్నారు.


నిమ్మకూరు సందర్శన

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరులో బాలకృష్ణ గురువారం సందడి చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించారు. సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించిన తర్వాత నిమ్మకూరు వచ్చినట్లు తెలిపారు. గురుకుల పాఠశాల విద్యార్థులు గార్డ్ ఆఫ్ హానర్‌తో స్వాగతం పలికగా, నిమ్మకూరు ఆడపడుచులు మంగళ హారతులు అందించారు.


బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో అంతర్జాతీయ వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్న బాలకృష్ణ, తన సంతోషాన్ని గ్రామస్తులతో పంచుకోవాలని నిమ్మకూరు వచ్చానని తెలిపారు. ఎన్టీఆర్ భావన ప్రకారం తెలుగు వారంతా ఒక్కటని, తన ఆలోచన కూడా అదేనని అన్నారు. రాయలసీమకు నీటి సమస్యను పరిష్కరించిన సీఎం చంద్రబాబును పొగడ్తలతో కొనియాడారు. తెలంగాణలో వరదలతో నష్టపోయిన తెలుగు వారికి సహాయం చేయాలని, సోషల్ మీడియాను మంచి కోసం వాడాలని సూచించారు.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story