Actress Kamakshi Bhaskarla: టాలీవుడ్‌లో ప్రతిభావంతులైన నటీమణులకు కొదవలేదు. అయితే, సొంత గడ్డపై తమ ప్రతిభను నిరూపించుకోవడానికి మన తెలుగు అమ్మాయిలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటి కామాక్షి భాస్కర్ల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఎదురవుతున్న సవాళ్ల గురించి మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

పొలిమేరా' సిరీస్,విభిన్న కథా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల.. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. టాలీవుడ్‌లో అటు స్టార్ డమ్ ఉన్న ప్రాజెక్టులలో కానీ, కీలకమైన పాత్రలలో కానీ స్థానిక తెలుగు యువతులకు అవకాశాలు ఇవ్వడంలో సరిగనటువంటి వివక్ష కనిపిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, పరభాషా నటీమణులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనివల్ల తెలుగు అమ్మాయిలు తమ సత్తా చాటుకోవడానికి రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక నటిగా తాను ఏ పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నానని, కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్నానని కామాక్షి తెలిపారు. అయినప్పటికీ, పరిశ్రమలో సరిగ్గా నిలదొక్కుకోవడానికి స్థానిక కళాకారిణులపై చూపే చిన్నచూపు మారాలని ఆమె కోరారు. తనలాంటి ఎంతో మంది అమ్మాయిల కలలకు ఇండస్ట్రీ పెద్దలు కూడా పెద్దపీట వేయాలని ఆమె ఆకాంక్షించారు.

కష్టాలు ఎన్ని ఎదురైనా సరే, మంచి కథలు, బలమైన పాత్రల ద్వారానే ప్రేక్షకుల్లో శాశ్వతస్థానం సంపాదించుకుంటానని కామాక్షి ధైర్యంగా చెప్పారు. ఆమె వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story