Dil Raju’s Sensational Comments: నిర్మాత విలువ తగ్గిపోయింది: దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

Dil Raju’s Sensational Comments: సినిమా ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితులపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నిర్మాతకు ఉండాల్సిన గౌరవం, విలువ తగ్గిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు నిర్మాత అంటే అందరికీ ఇచ్చేవాడని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎవరైతే నిర్మాత దగ్గర నుంచి తీసుకుంటున్నారో, వారే తిరిగి ఇచ్చిన వారిని శాసించే స్థాయికి చేరుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మారుతున్న ధోరణి పరిశ్రమకు మంచిది కాదన్నట్లుగా ఆయన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
సీనియర్ ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు 90వ పుట్టినరోజు సందర్భంగా కర్ణాటకలోని మడికేరిలో జరిగిన ఓ కార్యక్రమంలో దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అట్లూరి పూర్ణచంద్రరావుని ఆయన కొనియాడారు. 87 చిత్రాలను నిర్మించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన అట్లూరి గారి సమర్పణలో త్వరలోనే తాను ఒక సినిమాను నిర్మిస్తానని ఈ వేదికగా ప్రకటించారు. విలువలతో కూడిన చిత్రాన్ని నిర్మించి అట్లూరి గారికి అంకితం ఇస్తానని దిల్ రాజు వెల్లడించారు.
అంతేకాకుండా, తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని కూడా దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. తన నిర్మాణంలో వచ్చిన తొలి సినిమా ‘దిల్’ భారీ విజయం సాధించిన సమయంలో, ఆ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు అట్లూరి పూర్ణచంద్రరావు గారు తనను రైట్స్ అడిగారని పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. నిర్మాతలను శాసించే శక్తులు పెరిగిపోతున్నాయంటూ దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

