Saif Ali Khan:అది నాటకం కాదు.. తనపై జరిగిన దాడి మీద తొలిసారి స్పందించిన సైఫ్
తనపై జరిగిన దాడి మీద తొలిసారి స్పందించిన సైఫ్

Saif Ali Khan: బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీఖాన్ ఈ ఏడాది జనవరిలో తనపై జరిగిన దాడి ఘటనపై తొలిసారిగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దాడిని కొందరు కావాలనే ఒక నాటకంగా ప్రచారం చేశారని, ఈ విషయం తనను ఎంతగానో బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు వాస్తవాలను కూడా జనం నమ్మరని, అలాంటి సమాజంలో మనం ఉన్నామని సైఫ్ వ్యాఖ్యానించారు.
ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ ఘటన వివరాలను పంచుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు తాను నడుచుకుంటూ బయటకు రావడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. "అంబులెన్స్ లేదా వీల్చైర్లో కనిపిస్తే నా అభిమానులు తీవ్రంగా కంగారుపడతారని నేను భావించాను. నేను బాగానే ఉన్నానని వారికి భరోసా ఇవ్వడానికే అలా నడుచుకుంటూ వచ్చాను" అని సైఫ్ చెప్పారు. అయితే కొందరు ఈ చర్యను తప్పుగా అర్థం చేసుకున్నారని, అసలు దాడే జరగలేదని, ఇదంతా కేవలం ఒక నాటకమని ప్రచారం చేశారని ఆయన అన్నారు. "కానీ నా గాయాలు, నా పరిస్థితి పూర్తిగా నిజం" అని సైఫ్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది జనవరి 16న సైఫ్ అలీఖాన్పై ఓ దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు.. బంగ్లాదేశ్కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేవలం రూ. 30 వేల కోసమే షెహజాద్ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వారం రోజుల చికిత్స అనంతరం సైఫ్ కోలుకున్నారు. ఈ ఘటన తన జీవితంలో ఒక తీవ్రమైన అనుభవమని, మీడియా, అభిమానుల స్పందన కూడా తనకు ఒక పాఠం నేర్పిందని సైఫ్ అలీఖాన్ వ్యాఖ్యానించారు.
