ఇంట్లో విషాదం

Comedian Josh Ravi’s Home: టాలీవుడ్ కమెడియన్, నటుడు జోష్ రవి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ గుండెపోటుతో (హార్ట్ ఎటాక్తో) కన్నుమూశారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. గత వారం ఈ సంఘటన జరగ్గా ఆలస్యంగా ఈ విషయం బయటకొచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలంలోని మార్టేరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. మూడో కార్తీక సోమవారం సందర్భంగా శివాలయంలో అభిషేకాల కోసం వెళ్లిన సమయంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురై, ఇంటికి వెళ్లే లోపు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
జోష్ రవి ఒక్కగానొక్క కుమారుడు. రంగస్థలం, గ్యాంగ్ లీడర్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఈ పితృవియోగం తీరని లోటుగా మిగిలింది. జోష్ రవి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ వార్త తెలియగానే మార్టేరు గ్రామం మొత్తం శోకసముద్రంలో మునిగింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, గ్రామస్తులు రవి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.

