Jagapathi Babu: ఫ్యామిలీ హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై తనదైన ముద్ర వేసిన జగపతిబాబు.. ఇప్పుడు ఒక పవర్‌ఫుల్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తున్నారు. అదే ‘వదలా’. ఓల్డ్ మేన్... యంగ్ గర్ల్ అనే విభిన్నమైన అంశంతో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ వేడుక సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

‘నువ్వూ నేను... ఈ ప్రపంచం. అంతే. ఇంకెవ్వరూ లేరు’ అని భార్యతో చెబుతున్న యోగి అనే వ్యక్తి జీవితంలోకి మరో అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది? ‘వదలా..’ అంటూ ఒక అపరిచిత శక్తి ఆ కుటుంబాన్ని ఎందుకు వెంటాడుతోంది? అనే ఆసక్తికరమైన అంశాలతో టీజర్ సాగింది. దర్శకుడు ఆకెళ్ల వి.కృష్ణ రూపొందించిన ఈ టీజర్ చూస్తుంటే, సినిమాలో ఊహించని మలుపులు ఉంటాయని స్పష్టమవుతోంది. లయ, హృతికా శ్రీనివాస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను కిశోర్‌నాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా నిర్మించారు.

వేడుకలో హీరో జగపతిబాబు మాట్లాడుతూ తన నమ్మకాన్ని బయటపెట్టారు. "ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాక నిర్మాత కిశోర్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఇప్పుడే ఎవరికీ అమ్మకూడదని, ఇది కనీసం రూ. 45 నుంచి 50 కోట్లు వసూలు చేస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఖచ్చితంగా అలాంటి విజయం సాధిస్తుందని నేనూ నమ్ముతున్నా" అంటూ జగపతిబాబు ధీమా వ్యక్తం చేశారు. అలాగే తన పాత కో-స్టార్ లయతో మళ్లీ నటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపిస్తున్న నటి లయ మాట్లాడుతూ.. జగపతిబాబు తనకు రోల్ మోడల్ అని, ఆయనతో కలిసి మళ్లీ నటించడం ఆనందంగా ఉందని తెలిపారు. నిర్మాత భరద్వాజతో తనకు ఉన్న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ చిత్రం తన కెరీర్‌లో ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story