Yash : రామాయణ గ్రాఫిక్స్ అదిరిపోతది.. ఫ్యాన్స్కు క్లారిటీ ఇచ్చిన యశ్!
ఫ్యాన్స్కు క్లారిటీ ఇచ్చిన యశ్!

Yash : భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్.. ‘రామాయణ’. అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, గతంలో వచ్చిన కొన్ని పౌరాణిక చిత్రాల అనుభవ దృష్ట్యా, ఈ సినిమా గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో అన్న చిన్న భయం అభిమానుల్లో ఉంది. టీజర్ లీక్స్ అంటూ వస్తున్న వార్తలపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వినిపించాయి. అయితే తాజాగా రాకింగ్ స్టార్ యశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా మార్చేశాయి.
రావణాసురుడిగా నటిస్తూనే ఈ సినిమా నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్న యశ్.. గ్రాఫిక్స్పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమే ఇచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నవి కేవలం ప్రాథమిక దశలోని విజువల్స్ మాత్రమేనని అసలైన అవుట్పుట్ ఇంకా సిద్ధం కాలేదని ఆయన స్పష్టం చేశారు. రామాయణాన్ని విజువల్ వండర్గా చూపించడమే మా లక్ష్యం.. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు అంటూ ఆయన ఇచ్చిన భరోసా ఇప్పుడు ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈ సినిమా కోసం పని చేస్తున్నది సాదాసీదా సంస్థ కాదు.. ప్రపంచంలోనే టాప్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ 'DNEG'. హాలీవుడ్ క్లాసిక్స్ అయిన 'ఇంటర్స్టెల్లార్', 'టెనెట్', 'డ్యూన్-2' వంటి సినిమాలకు ప్రాణం పోసిన ఈ కంపెనీ, ఇప్పుడు మన రామాయణానికి విజువల్స్ అందిస్తోంది. ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన అనుభవం ఉన్న టెక్నీషియన్లు, భారతీయ పురాణ ఇతిహాసాన్ని వెండితెరపై ఎలా ఆవిష్కరించబోతున్నారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గ్రాఫిక్స్ పనులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని, ఫైనల్ ఔట్పుట్ చూశాక ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారని యశ్ ధీమా వ్యక్తం చేశారు. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 500 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అందులో సింహభాగం కేవలం VFX కోసమే వెచ్చిస్తున్నారంటే మేకర్స్ ఎంత పకడ్బందీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

