Tirupati: 1000 ఏళ్ల చరిత్ర.. ఒక్కసారి దర్శిస్తే పాపాలు పోతాయ్
ఒక్కసారి దర్శిస్తే పాపాలు పోతాయ్

Tirupati:తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం అతి పురాతనమైనది. సుమారు వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎత్తైన గోపురాలతో, అద్భుతమైన కళా సంపదతో అలరిస్తోంది. నిత్యం వేలాదిమంది యాత్రికులతో గోవిందరాజస్వామి ఆలయం సందడిగా ఉంటుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులందరూ గోవిందరాజస్వామిని కూడా దర్శించుకోవడం పరిపాటి.
ఆలయ చరిత్ర
తిరుపతి పట్టణం ఏర్పడకముందే గోవిందరాజస్వామి ఆలయం వెలసి ఉండడం విశేషం. పదకొండవ శతాబ్దంలో చోళ రాజైన కుళోత్తంగ రాజు పరిపాలించే సమయంలో భగవద్ శ్రీ రామానుజాచార్యులు తిరుమల క్షేత్రానికి వచ్చారు. ఆ రోజుల్లో తిరుమల కొండ దిగువున కొత్తూరు అనే చిన్న గ్రామం ఉండేది. అప్పు రామానుజాచార్యులు తమిళనాడులోని చిదంబరం నుంచి గోవిందరాజస్వామి విగ్రహాన్ని తెప్పించి ఇక్కడ ప్రతిష్టించారు. ఈ ఆలయ కేంద్రంగా ఏర్పడి విస్తరించిన పట్టణమే తిరుపతి. ఆ కాలంలో గోవిందరాజులు వెలసిన పట్టణం కాబట్టి గోవిందరాజ పట్టణమని, రామానుజులు ప్రతిష్టించారు కాబట్టి రామానుజ పురమని పిలిచేవారు. కాలక్రమేణా అదే తిరుపతి పట్టణంగా మారింది.
వడ్డికాసులవాడు ఈ గోవిందుడు!
గర్భాలయంలో శయన మూర్తిగా ఉన్న గోవిందుని దర్శిస్తే సకల పాపాలు పోతాయని బ్రహ్మాండ పురాణంలో వివరించారు. స్థానికుల కథనం ప్రకారం గోవిందుడు శ్రీనివాసుని అన్నగా ప్రసిద్ధి చెందాడు. తిరుమల కొండమీద శ్రీనివాసుని వడ్డి కాసుల్ని కొలిచి అలసిపోయిన గోవింద రాజుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని భక్తులు చెబుతారు. అందుకే గోవిందుడు తలకింద కుంచెం పెట్టుకుని, శయన భంగిమలో దర్శనమిస్తాడు.
భక్తుల పాలిట కల్పవల్లి ఈ పుండరీకవల్లి
గోవిందరాజస్వామి ఆలయం ప్రాంగణంలో అమ్మవారు శ్రీ పుండరీక వల్లిగా దర్శనమిస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్ర మందిరం, రామానుజాచార్యులు, వేదాంత దేశిక, తిరుమలనంబి, ఇతర ఆళ్వారులు కూడా దర్శనమిస్తారు.
