జూన్ నెల దర్శన టికెట్ల విడుదల తేదీలు ఖరారు!

Alert for Tirumala Devotees: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు టీటీడీ ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. 2026 జూన్ నెలకు సంబంధించిన వివిధ దర్శన కోటాలు, ఆర్జిత సేవలు మరియు గదుల బుకింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రక్రియ మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన వంటి ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌తో ప్రారంభమవుతుంది. భక్తులు మార్చి 20వ తేదీ ఉదయం వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు మార్చి 22 మధ్యాహ్నం లోపు నగదు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక మార్చి 21వ తేదీన మరిన్ని కీలక కోటాలు విడుదల కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలకు సంబంధించిన స్లాట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. అనంతరం మార్చి 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు మరియు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం కేటాయించిన ప్రత్యేక ఉచిత దర్శన కోటాను విడుదల చేస్తారు.

అత్యధికంగా భక్తులు ఎదురుచూసే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి తిరుమల, తిరుపతిలోని వసతి గదుల బుకింగ్ కూడా మొదలవుతుంది. జూన్ నెలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందుగానే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story