Amarnath Yatra: ప్రస్తుత ఏడాది పవిత్ర అమరనాథ్ యాత్రకు వాతావరణం బ్రేక్ వేసింది. భారత వాతావరణ శాఖ జారీ చేసిన తీవ్ర వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జూలై 19 నుండి అమరనాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు, హఠాత్తుగా వచ్చే వరదలు, కొండచరియలు విరిగిపడే ముప్పు ఉండటంతో, యాత్రికుల ప్రాణ రక్షణ కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

బేస్ క్యాంపుల వద్దే నిలిచిన భక్తులు

అధికారుల ఆదేశాల ప్రకారం.. పహల్గామ్, బాల్టాల్ అనే రెండు ప్రధాన మార్గాల ద్వారా పవిత్ర అమరనాథ్ గుహ వైపు వెళ్లే ప్రయాణాన్ని పూర్తిగా నిలిపివేశారు. బాల్టాల్ బేస్ క్యాంప్, నున్వాన్-చందన్‌వారీ బేస్ క్యాంప్‌ల నుండి ఎలాంటి భక్తులను ముందుకు వెళ్లడానికి అనుమతించడం లేదు. ఇప్పటికే బేస్ క్యాంపులకు చేరుకున్న యాత్రికులు అందరూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, స్థానిక యంత్రాంగం ఇచ్చే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు.

వరదల భీతి

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాశ్మీర్ పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం, రాళ్లు దొర్లే ముప్పు గణనీయంగా పెరిగింది. అత్యంత నిటారుగా, ప్రమాదకరంగా ఉండే యాత్ర మార్గంలో భక్తుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తప్పనిసరయ్యాయి. అయితే, బేస్ క్యాంపుల్లో ఉన్న భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి కావాల్సిన వసతులను పర్యవేక్షిస్తున్నామని శ్రీ అమరనాథ్‌జీ శ్రైన్ బోర్డ్ తెలిపింది.

అధికారుల కీలక విజ్ఞప్తి

వాతావరణ పరిస్థితులు కుదుటపడిన తర్వాత, యాత్రా మార్గాల భద్రతను పూర్తిగా సమీక్షించి, తిరిగి యాత్రను ఎప్పుడు ప్రారంభించేది అధికారికంగా ప్రకటిస్తామని మేనేజ్‌మెంట్ కమిటీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, కేవలం ప్రభుత్వం మరియు శ్రైన్ బోర్డ్ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని యాత్రికులకు విజ్ఞప్తి చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story